
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం చేపల వేటకు వెళ్లిన ఓ గిరిజనుడు అనుమానాస్పద పరిస్థితుల్లో గల్లంతవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ముంచంగిపుట్టు మండలంలోని జోలపుట్టు పంచాయతీ బొండ్రుగూడ గ్రామానికి చెందిన నరంజి అద్దు (45) శనివారం (జూన్ 20) చేపల వేట కోసం సమీపంలోని బొండ్రుగూడ గెడ్డ బలిఘాట్ ప్రాంతానికి వెళ్లాడు. అతనితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా చేపల వేటలో పాల్గొన్నట్లు సమాచారం.
చేపల కోసం గెడ్డలో వలలు వేస్తున్న సమయంలో నరంజి అద్దు అకస్మాత్తుగా కనిపించకుండా పోయినట్లు సహచరులు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
నరంజి అద్దుకు భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆయనే ప్రధాన ఆధారంగా ఉండటంతో ఆయన గల్లంతవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. గ్రామస్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయాడా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు, స్థానికులు కలిసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..