
అలజడి రేపిన మొంథా తుఫాన్ మంగళవారం అర్ధరాత్రి తీరాన్ని దాటేసింది. రాత్రి పన్నెండున్నరకు కాకినాడకు దక్షిణాన నరసాపురం సమీపంలో తీరాన్ని దాటింది. కానీ వాన గండం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. తగ్గేదే లేదన్నట్టుగా తీరం వెంట మొంథా తుఫాన్ ఇంకా విజృంభిస్తూనే ఉంది. తీరం ఇంకా ఉగ్రంగా ఉప్పొంగుతూనే ఉంది. ఎగిసిపడుతున్న అలలతో బంగాళాఖాతం కల్లోల్లంగా మారింది. తీరం వెంట గాలులు బలంగా వీస్తున్నాయి. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి.. వానలు దంచికొడుతూనే ఉన్నాయి. తుఫాన్ ప్రభావంతో పెరిగిన గాలుల తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్..నైరుతి బంగాళాఖాతాన్ని దాటి ,పశ్చిమ దిశ గా సాగి, అంతర్వేది పాలెం దగ్గర తీరాన్ని తాకింది. గంటకు 15 కిమీ వేగంతో కదులుతూ ఉత్తర వాయువ్య దిశగా కాకినాడ వైపు ప్రయణించింది. కాకినాడకు దక్షిణాన నరసాపురం దగ్గర అర్ధరాత్రి 11:30-12:30 మధ్య మొత్తానికి తీరాన్ని దాటింది.
క్లౌడ్ మాస్ ఎఫెక్ట్తో మరో రెండు రోజుల మొంథా తుఫాన్ ప్రభావం కొనసాగుతుందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఏపీలో భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
మత్స్యకారులు ఎవరూ రెండు రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది వాతావరణ శాఖ. పోర్టుల్లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథం..
మొంథా తుఫాన్ తీరం దాటినా వాన గండం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇవాళ, రేపు తీరం వెంట ఈదురుగాలులు ప్రభావం వుంటుంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ
ఇక రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు..
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..