Andhra Pradesh: ఆ బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన బంగారం మాయం అయినట్లు ప్రచారం .. ఆందోళనలో కస్టమర్లు

| Edited By: Surya Kala

Nov 28, 2023 | 6:36 PM

బ్యాంక్ లాకర్ లో ఉంచిన ఆభరణాలు కొన్ని మాయమయ్యయంటూ ఈ నోట ఆ నోట ప్రచారం జరగడంతో కస్టమర్లందరిలోనూ ఆందోళన తీవ్రమైంది. ఈ క్రమంలో డబ్బులు ఉండి బ్యాంక్ లో ఉన్న తమ ఆభరణాలను విడిపించుకుందామనే వారే కాకుండా కొందరు కస్టమర్లకు అప్పు చేసి మరీ డబ్బులు తీసుకువచ్చి తమ ఆభరణాలను విడిపించుకునేందుకు ముందుకు రావడంతో బ్యాంకు సిబ్బందిపై మరింత ఒత్తిడి పెరిగింది.

Andhra Pradesh: ఆ బ్యాంక్‌లో తాకట్టు పెట్టిన బంగారం మాయం అయినట్లు ప్రచారం .. ఆందోళనలో కస్టమర్లు
Gold Ornaments Loan In Sbi
Follow us on

శ్రీకాకుళం జిల్లా గార మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గత నాలుగు రోజులుగా గందరగోళం నెలకొంది. ఖాతాదారులు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విషయమై తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. తాము కొదవ పెట్టిన బంగారాన్ని విడిపించుకుంటామని డబ్బులు కట్టేందుకు మందుకు వస్తోన్న కస్టమర్లకు బంగారం ఇవ్వకుండా రేపు మాపు అంటూ బ్యాంక్ అధికారులు వాయిదా వేస్తూ ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అధికారులు చెబుతోన్న సమాధానాలు బ్యాంక్ లో కొదవపెట్టిన బంగారం అసలు సేఫ్ గా ఉందో లేదో తెలియని అయోమయానికి గురిచేస్తోంది.

కొదవపెట్టిన బంగారం మాయం అయినట్లు ప్రచారం..

డబ్బులు అవసరం వచ్చి గార SBI లో బంగారాన్ని కొదవ పెట్టీ లోన్ తీసుకున్నవారి బంగారు ఆభరణాలు కొన్ని మిస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో బ్యాంకులో పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగినీ పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. క్యాష్ ఇన్చార్జ్ సెలవులో ఉన్న సమయంలో ఈ వ్యవహారం నడిచినట్టు సమాచారం. శెలవు తరువాత విధుల్లోకి చేరిన ఉద్యోగి బంగారు ఆభరణాల వివరాలు తెలుసుకోవడంతో అసలు విషయం బయటపడిందనీ తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొదవ పెట్టిన తమ బంగారు ఆభరణాల నగదు చెల్లించి విడిపించుకుందామని బ్యాంక్ కి వెళ్తోన్న కస్టమర్లకు ఆభరణాలు ఇప్పుడు ఇవ్వలేమంటూ బ్యాంక్ సిబ్బంది చెబుతుండటంతో గత నాలుగు రోజులుగా బ్యాంక్ లో అసలు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి కస్టమర్లలో నెలకొంది.

బ్యాంక్ లాకర్ లో ఉంచిన ఆభరణాలు కొన్ని మాయమయ్యయంటూ ఈ నోట ఆ నోట ప్రచారం జరగడంతో కస్టమర్లందరిలోనూ ఆందోళన తీవ్రమైంది. ఈ క్రమంలో డబ్బులు ఉండి బ్యాంక్ లో ఉన్న తమ ఆభరణాలను విడిపించుకుందామనే వారే కాకుండా కొందరు కస్టమర్లకు అప్పు చేసి మరీ డబ్బులు తీసుకువచ్చి తమ ఆభరణాలను విడిపించుకునేందుకు ముందుకు రావడంతో బ్యాంకు సిబ్బందిపై మరింత ఒత్తిడి పెరిగింది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో శ్రీకాకుళం SBI రీజనల్ మేనేజర్ రాజు తో పాటు విశాఖ నుండి అధికారులు సోమవారం గార SBI కి చేరుకొని బ్యాంకు రికార్డులను పరిశీలించారు. మరోవైపు కస్టమర్లు సైతం పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు చేరుకొని కొదవ పెట్టిన తమ బంగారు ఆభరణాలు ఏమయ్యాయో స్పష్టత ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు. లోన్ డబ్బులు చెల్లిస్తామంటున్నా తమ ఆభరణాలు ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు. దీంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్తగా పోలీసులు SBI వద్దకు చేరుకున్నారు.

బంగారు ఆభరణాలు సేఫ్ గా ఉన్నాయంటున్న బ్యాంక్ అధికారులు

గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్ల ఆందోళనలతో బ్యాంక్ అధికారులు స్పందించారు. శ్రీకాకుళం ఎస్బిఐ రీజినల్ మేనేజర్ రాజు తో పాటు, విశాఖ నుంచి వచ్చిన అధికారులు బాధిత కస్టమర్లతో మాట్లాడారు. బంగారు ఆభరణాలు సేఫ్ గానే ఉన్నాయంటూ స్పష్టం చేశారు. ఆభరణాలు మిస్ అయ్యాయి అనేది దుష్ప్రచారమని దానిని నమ్మవద్దని తెలిపారు. బ్యాంకులో ఆడిట్ జరుగుతుండటం వల్ల బంగారాన్ని ఇవ్వలేకపోతున్నట్లు చెప్పారు. లోన్ డబ్బులు చెల్లిస్తామంటున్న తమ ఆభరణాలు ఇవ్వకుండా రోజులు కొలది జాప్యచేయటం ఎంత వరకు సమంజసమని బాధితులు నిలదీశారు. ఏ రోజు తమ ఆభరణాలు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈనెల 8వ తేదీ తరువాత ఇస్తామని అధికారులు చెప్పగా లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కస్టమర్లు డిమాండ్ చేశారు. చివరకు బ్యాంకు అధికారులు, పోలిసులు నచ్చచెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. గడువులోగా తమ ఆభరణాలు ఇవ్వకపోతే తమ ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించి ఖాతాదారులు వెనుతిరిగారు. అయితే తాత్కాలికంగా ఆందోళన విరమించినప్పటికి గడువులోగా ఆభరణాలు ఇవ్వకుంటే మాత్రం వివాదం మరింత పెద్దదయ్యేలా కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..