AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డీకే శివకుమార్ అండ ఉన్నా దక్కని సీటు.. షర్మిల రాజ్యసభ ఆశలపై నీళ్లు చల్లిన కర్ణాటక కాంగ్రెస్!

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కాంగ్రెస్ పార్టీలో అది ఇంకా కష్టం. దానికి ఇదే నిదర్శనం. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో మంచి సంబంధాలు ఉన్నా వైఎస్‌ఆర్ కూతురు, పార్టీ విలీన హామీ ఇవేవీ షర్మిలకు రాజ్యసభ స్థానం ఇప్పించలేక పోయాయి. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిననాటి నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షురాలు వైఎస్ షర్మిల కర్ణాటక రాజ్యసభ రేసులో ఉన్నారు.

డీకే శివకుమార్ అండ ఉన్నా దక్కని సీటు.. షర్మిల రాజ్యసభ ఆశలపై నీళ్లు చల్లిన కర్ణాటక కాంగ్రెస్!
Ap Pcc Chief Ys Sharmila
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 4:41 PM

Share

‘నా సంగతేంటి.. నాకు ఇచ్చిన హామీ గుర్తుంది కదా.. నాకు రాజ్యసభ ఇవ్వాలి’ ఇది వారం రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అధిష్టానానికి గుర్తు చేసిన మాటలు. కానీ ఇప్పుడు సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్ని అవుతాయా ఏంటి..! ఇది ఇప్పుడు షర్మిల పరిస్థితి. రాజ్యసభ విషయంలో వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం మొండి చేయు చూపింది. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం సందర్భంగా తనకు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ను షర్మిల కలిసి చేసిన విజ్ఞప్తి ఫలించలేదు.

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. కాంగ్రెస్ పార్టీలో అది ఇంకా కష్టం. దానికి ఇదే నిదర్శనం. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో మంచి సంబంధాలు ఉన్నా వైఎస్‌ఆర్ కూతురు, పార్టీ విలీన హామీ ఇవేవీ షర్మిలకు రాజ్యసభ స్థానం ఇప్పించలేక పోయాయి. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిననాటి నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అద్యక్షురాలు వైఎస్ షర్మిల కర్ణాటక రాజ్యసభ రేసులో ఉన్నారు. దక్షిణాదిలో తెలంగాణ, కర్ణాటకలో సొంతంగా అధికారంలో ఉండగా కేరళ, తమిళనాడులో భాగస్వామ్య పక్షాలతో అధికారంలో ఉంది. ఏపీలో కూడా కాంగ్రెస్ బలపడాలన్నా, ఏపీ గొంతుక పార్లమెంట్ లో వినిపించాలంటే రాజ్యసభ ఒక మంచి అవకాశంగా షర్మిల భావించారు.

తనకు రాజ్యసభ స్థానంతో ఏపీలో పార్టీ బలోపేతం అవుతుందన్న విషయాన్ని సైతం అధిష్టానానికి తెలిపారు. ఖచ్చితంగా తనకు రాజ్యసభ వస్తుందన్న ధీమాలో నిన్నటి వరకు షర్మిల ఉన్నారు. ఆపై మల్లిఖార్జున ఖర్గే సైతం హైదరాబాద్ వేదికగా మీడియాతో మాట్లాడుతూ షర్మిలకు రాజ్యసభ హామీ ఉందన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. కానీ తాజాగా అధిష్టానం ప్రకటించిన రాజ్యసభ అభ్యర్ధుల జాబీతాలో షర్మిల పేరు లేకపోవడం ఆమెకు షాక్‌కు గురి చేసింది.

వైఎస్ఆర్ కుమార్తె, తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినా షర్మిలకు రాజ్యసభ ఇవ్వకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయంటున్నారు పార్టీ వర్గాలు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేకపోవడం, జాతీయ స్థాయిలో పార్టీకి ఉన్న అవసరాల నేపథ్యంలో హై కమాండ్ షర్మిలను రాజ్యసభ నిరాకరించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో షర్మిల అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ పుంజుకోలేకపోవడం, సీనియర్ నాయకుతో విభేదాలు, కూటమి ప్రభుత్వ వ్యతిరేకత కార్యక్రమాలు చేపట్టకపోవటం, కేవలం జగన్ మీద ఆరోపణలకే పరిమితం అవడం తప్ప పార్టీకి ప్రయోజన కార్యక్రమాలు చేపట్టలేదని షర్మిలపై అధిష్టానం వద్దకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. అదేవిధంగా కర్టాటక కాంగ్రెస్ స్థానిక నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత కారణంగా చివరి నిమిషంతో ఏఐసీసీ మీడియా ఇంచార్జ్ పవన్ ఖేరా, మల్లిఖార్జున ఖర్గే, మన్సూర్ కు రాజ్యసభ స్థానాలు దక్కాయి.

ప్రస్తుతం షర్మిల బెంగుళూరులో ఉన్నారు.కాంగ్రెస్ లోకి షర్మిలను తీసుకోచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకూమార్ ప్రమాణస్వీకారానికి హాజరైన షర్మిల రెండు రోజులుగా అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ కేటాయించకపోవటంతో ఎందుకు అవకాశం ఇవ్వలేదు అనేది అధిష్టానాన్ని అడగడం కన్నా ఏపీలో పార్టీ బలోపేతం పై దృష్టిసారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us