151 మంది ఎమ్మేల్యేలతో ఘనవిజయం వైసీపీ పార్టీలో ఇప్పుడు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. అనేక సామాజిక వర్గ కోటాలను, లాభ నష్టాలను బేరీజు వేసిన ఏపీ సీఎం జగన్ పకడ్భందీగా తన కేబినెట్లోకి మంత్రులను తీసుకున్నారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తూ రాజకీయ నిపుణులతో శభాస్ అనిపించుకున్నారు. కాకపోతే మొదటి నుంచి పార్టీకి లాయల్గా పనిచేసిన వారు, వివిధ వేదికలపై పార్టీ వాయిస్ను గట్టిగా వినిపించినవారు, అనేక వ్యయప్రయాలకోర్చిన పార్టీని ముందుకు తీసుకెళ్లినవారు జగన్ ఫస్ట్ కేబినెట్లో చోటు దక్కకపోవడంతో అలక పాన్పు ఎక్కారు. ముందు కేబినెట్ కూర్పు పూర్తి చేసి..సచివాలయ ప్రవేశం చేసిన జగన్ తాజాగా అసంతృప్తులపై దృష్టి పెట్టారు. మంత్రి మండలి చోటు దక్కని ఆశావహులని పిలిచి మాట్లాడుతున్నారు.
ఇందులో భాగంగా ఈ రోజు కృష్టా జిల్లా వైసీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను సీఎం జగన్తో భేటీ అయ్యారు. మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణాలు వివరించిన జగన్..ప్రస్తుతానికి విప్ పదవి ఇచ్చి..రెండన్నరేళ్ల తర్వాత కూర్పులో మంత్రి పదవి ఇస్తానని హామి ఇచ్చారు. ఖచ్చితంగా మీరు మా మనసులో ఉంటారు..సరైన సమయంలో గౌరవిస్తామని సీఎం ఎమ్మెల్యేతో అన్నట్టు సమాచారం.
జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న భాను ప్రతిపక్షంలో ఉన్నప్పడు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి ప్రభుత్వ వైపల్యాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అంతేకాకుండా గతంలో వైఎస్సార్కి అత్యంత సన్నిహితుడిగా మెలగడం, ఆయన హయాంలో ప్రభుత్వ విప్గా పనిచేయడం వంటి గమనించిన కొందరు నేతలు ఆయనకు మంత్రి పదవి పక్కా అనుకున్నారు. కాకపోతే అప్పటికే అన్ని అంచనాలు వేసిన సీఎం జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం..మరోవైపు భాను సామాజికవర్గానికే చెందిన పేర్ని నానికి బెర్త్ కన్పార్మ్ అవ్వడంతో సామినేనికి నిరాశ తప్పలేదు.