చంద్రబాబు మాట అంటే మాటే..! ఓ పేదింటి వ్యక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారాయన. ఎన్నికల హామీలను అత్యంత వేగవంతంగా అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు తాను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలపై సైతం అంతే వేగంగా స్పందిస్తున్నారు. ఓ నిరుపేద కుటుంబానికి సొంతిల్లు కట్టిస్తానని మాటిచ్చి.. రెండు వారాలు తిరక్కుండానే ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయించి మాట నిలబెట్టుకున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు గుంటూరుజిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని ఎస్టీ కాలనీ నుంచి జూలై1వ తేదీన ప్రారంభించారు.
పెనుమాక ఎస్టీ కాలనీలో నివాసం వుంటున్న బాణావత్ పాములు నాయక్ ఇంటికి వెళ్లి వృద్ధాప్య పింఛన్, ఆయన కుమార్తెకు వితంతు పింఛన్, భార్యకు రాజధాని పింఛన్ను స్వయంగా అందజేశారు చంద్రబాబు. అనంతరం గుడిసెలో ఎందుకు ఉంటున్నారని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని తమకు ఇల్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబును కోరారు నాయక్. వెంటనే స్పందించిన చంద్రబాబు అప్పటికప్పుడు ఇల్లు మంజూరు చేశారు. సరిగ్గా 11 రోజులకే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సొంతింటి నిర్మాణానికి పాములు నాయక్ దంపతులు శంకుస్థాపన చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..