
ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక్కడికి వచ్చే భక్తులు రెండు మూడు రోజులు ఉండేలా సకల సదుపాయాలు కల్పిస్తామన్నారు. కడప జిల్లా, ఒంటిమిట్టలో జరిగిన శ్రీసీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొని స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. జానకీ వల్లభ కల్యాణాన్ని కన్నులారా తిలకించేందుకు వీలుగా ఆలయానికి సమీపంలో కల్యాణవేదిక ప్రాంతంలో 23 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 3వేల మంది పోలీసులు, సీసీ కెమెరాలు, డ్రోన్లతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఒంటిమిట్ట కిటకిటలాడింది. సీతారాముల కల్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
న్నుల పండువగా ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణానికి భక్తులు తరలివచ్చారు. అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా కళ్యాణోత్సవం జరిగింది. ఇక్కడి వచ్చిన భక్త జనాన్ని చూస్తుంటే సీతారాముల వారు దిగొచ్చి కళ్యాణం చేసుకుంటున్నట్లుగా అనిపించిందని, దేవుణ్ని దర్శించుకుని మనం కొన్ని సంకల్పాలు తీసుకుని తలచుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సీతారాముల వారు ఆదర్శ దంపతులు.. పరిపాలన అంటే రామపాలన రావాలి.. రాముడి పాలన జరగాలని కోరుకుంటారని సీఎం తెలిపారు. సీతారాముల కళ్యాణాన్ని మన ఒంటిమిట్టలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్న చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని ఒంటిమిట్టలో చేయాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించిందని గుర్తుచేశారు. 11వ శతాబ్ధంలో ఏకశిలా విగ్రహ రూపంలో ఏర్పాటైంది. ఈ ప్రాంతమంతా దేవుడి నామస్మరణంతోనే ఉండాలి. ఇక్కడి చెరువు ఆధునీకరణకు పనులు ప్రారంభించామని సీఎం చంద్రబాబు తెలిపారు.
రామరాజ్యమే నా ఆకాంక్షః చంద్రబాబు
దేవాలయాలు మన వారసత్వ సంపద. ఈ దేవాలయాలు లేకపోతే కుటుంబ వ్యవస్థ ఉండేది కాదన్నారు సీఎం చంద్రబాబు. ఏ దేశానికి లేని గొప్ప వారసత్వ సంపద మన దేశానికి ఉంది. మన తర్వాత వారసులకు కూడా మనం వారసత్వాన్ని అందించాలన్నారు. రాముడి పాలన ఇవ్వాలని, రామరాజ్యం తేవాలనేది నా ఆకాంక్ష. రాముడి సాక్షిగా చెప్తున్నా…ప్రతి ఒక్కరికీ మేలు చేయడమే నా ఆలోచన, ధ్యేయం. రామరాజ్యంలో పేదరికం పోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా, ఆర్థిక అసమానతలు లేకుండా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. సంపాదనలో కొంత దేవుడుకి ఇచ్చి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మానవ సేవే.. మాధవ సేవ. దేవునికి సేవ చేయడం అంటే మనతో ఉన్నవారిని సమానంగా పైకి తీసుకురావడం. శ్రీరాముడి స్ఫూర్తితో పేదలను ఆదుకునేందుకు ముందుకురావాలని కోరుతున్నా’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..