
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలతో జిల్లా రాజకీయ స్వరూపమే మారిపోబోతోంది. ప్రస్తుతం ఉన్న 14 అసెంబ్లీ స్థానాల సంఖ్య ఏకంగా 21కి పెరిగే అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీల్లోనూ, అభ్యర్థుల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. 2004 వరకు ఉమ్మడి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండేవి. 2009 పునర్విభజనలో వాయల్పాడు, పుత్తూరు, వేపంజేరి నియోజకవర్గాలు రద్దు కాగా.. కొత్తగా గంగాధర నెల్లూరు, పూతలపట్టు ఏర్పడ్డాయి. దీంతో సీట్ల సంఖ్య 14కి తగ్గింది. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ సంఖ్య 21కి చేరనుండటం విశేషం.
రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లాగా ఆవిర్భవించిన తిరుపతిలో జనాభా ప్రాతిపదికన భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో భాగంగా ఉన్న తిరుపతి రూరల్ మండలాన్ని విడదీసి కొత్త నియోజకవర్గంగా మార్చే అవకాశం ఉంది. ఇందులో రామచంద్రపురం మండలాన్ని కూడా కలిపే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగా ఉండటంతో రేణిగుంట కేంద్రంగా కొత్త సీటు ఏర్పాటుపై చర్చ జరుగుతోంది. గతంలో రద్దయిన పుత్తూరు నియోజకవర్గం మళ్ళీ తెరపైకి రానుంది. సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి నాయుడుపేటను విడదీసి కొత్త నియోజకవర్గం చేసే ఛాన్స్ ఉంది.
పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం కేంద్రంగా కొత్త స్థానం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. పీలేరు నియోజకవర్గం నుంచి కలికిరి కేంద్రంగా మరో కొత్త నియోజకవర్గం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అసెంబ్లీ స్థానాలతో పాటు ఉమ్మడి జిల్లాలో మరో లోక్ సభ స్థానం కూడా పెరిగే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి రెండు పార్లమెంట్ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో కొత్తగా ఏర్పడే పార్లమెంట్ స్థానం జనరల్ కేటగిరీ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచే ఆయా నియోజకవర్గాల కీలక నేతలు ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారు. జిల్లాల విభజనతో ఇప్పటికే మూడు ముక్కలైన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇప్పుడు నియోజకవర్గాల పెంపుతో పొలిటికల్ పవర్హౌస్గా మారబోతోంది. ఈ మార్పులు ఏ పార్టీకి కలిసి వస్తాయి? పాత నియోజకవర్గాల సరిహద్దులు ఎలా మారుతాయి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.