Somu Veerraju: “ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్‌ బహిరంగ చర్చకు రాగలరా?”.. సోము వీర్రాజు సవాల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు...

Somu Veerraju: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్‌ బహిరంగ చర్చకు రాగలరా?.. సోము వీర్రాజు సవాల్..
Somu Veerraju

Updated on: Oct 15, 2022 | 7:00 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారనే కనీస అవగాహన కూడా లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారని ధ్వజమెత్తారు. విశాఖకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటో జగన్‌కు తెలుసా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. మూడేళ్ల పాలనలో విశాఖకు సీఎం జగన్ చేసిందేమీ లేదన్న సోము వీర్రాజు.. విశాఖ అభివృద్ధి కోసం కేంద్రం రూ. వేల కోట్ల నిధులు ఇచ్చిందని వెల్లడించారు. అమరావతి రైతులు యాత్ర చేస్తుంటే కుట్రలు పన్నుతున్నారని, రైతుల ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేలా ప్రధాని మోడీ నేతృత్వంలో ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తున్నాం. కోడూరు, మేదరమెట్ల రోడ్డుకు టెండర్లు పిలిచారు.రాష్ట్రంలో అనేక వంతెనలు, జాతీయ రహదారులను నిర్మిస్తున్నారు. ఫొటోలకు పోజులిచ్చే జగన్‌కు రోడ్లు వేసే దమ్ము లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్‌ బహిరంగ చర్చకు రాగలరా?. ఎయిమ్స్ ఆసుపత్రి, విఆర్టీ, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీకి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. ఇది జగన్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనం.

– సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

అమరావతి లో అభివృద్ధి ఆపేసి ఎడారిగా మార్చారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో విద్యాసంస్థలను ఇక్కడ నెలకొల్పారని, రాష్ట్రాన్ని నమ్ముకుని వచ్చిన యాజమాన్యాలు అన్యాయానికి గురవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో రాష్ట్రం గురించి ఏమనుకుంటారో అని కూడా ఆలోచించడం లేదని ధ్వజమెత్తారు. పదకొండు కిలోమీటర్ల ఉన్న రోడ్ ను డబుల్ లైన్ గా అభివృద్ధి చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Follow Us