
శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి మదనపల్లి వెళ్లేందుకు బస్సు దొరకకపోవడంతో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఏకంగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆర్టీసీ హయర్ బస్సును దొంగిలించి వెళ్లిపోయాడు. ఈ ఘటన కదిరి పట్టణంలో కలకలం రేపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో బస్పును ఛేదించారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా బాలికల పాఠశాల వద్ద హయర్ కోసం నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును శివప్రసాద్ అనే వ్యక్తి అర్ధరాత్రి తీసుకెళ్లాడు. మదనపల్లి వెళ్లాలనే ఉద్దేశంతో బస్సులో ఎక్కిన అతడు, అక్కడ డ్రైవర్ లేకపోవడంతో తానే బస్సును స్టార్ట్ చేసి నేరుగా మదనపల్లికి వెళ్లిపోయాడు.
తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సును నిలిపి ఉంచాడు. అదే సమయంలో మద్యం మత్తులో అనుమానాస్పదంగా తిరుగుతున్న శివప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. కదిరిలో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును తానే దొంగిలించి తీసుకొచ్చానని పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో మదనపల్లి పోలీసులు వెంటనే కదిరి ఆర్టీసీ డిపో అధికారులకు సమాచారం అందించారు. అనంతరం హయర్ బస్సు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దొంగిలించిన బస్సును స్వాధీనం చేసుకుని కదిరికి తరలించారు.
సాధారణంగా ప్రయాణికులు బస్సు ఎక్కి గమ్యస్థానానికి వెళ్తారు. కానీ బస్సు లేకపోవడంతో ఏకంగా బస్సునే దొంగిలించి వెళ్లిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మద్యం మత్తులో చేసిన ఈ వింత చేష్టతో శివప్రసాద్ ఇప్పుడు పోలీసు కేసును ఎదుర్కొంటున్నాడు. ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..