Andhra Pradesh: గ్రేట్ వర్క్.. దట్స్ నైస్.. ఏపీ ప్రభుత్వ పనితీరుపై బిల్ గేట్స్ ప్రశంసలు
బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు వచ్చారు. సోమవారం ఉదయం ఏపీకి రాగా.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ను బిట్ గేట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా డిజిటల్ గవర్నెన్స్ గురించి బిల్ గేట్స్కు చంద్రబాబు వివరించారు. దీంతో గ్రేట్ అంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని బిల్ గేట్స్ పరిశీలించారు. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను బిల్ గేట్స్కు ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్లోని డిస్ ప్లే వాల్స్పై ప్రజంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని చంద్రబాబు వివరించగా.. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్నారు బిల్ గేట్స్.
గ్రేట్ అంటూ బిల్గేట్స్ కితాబు
అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్లో సమారాచాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెతిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించగా.. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించగా.. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని, అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందన్న గేట్స్ వ్యాఖ్యానించగా.. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని చంద్రబాబు వివరించారు. తమ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును బిల్గేట్స్ అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారని తెలుసుకున్నారు.
కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ దట్స్ నైస్ అంటూ బిల్ గేట్స్ కితాబిచ్చారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్, ఆహారం తదితర అంశాల్లో సలహాలు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగు పరిచేలా చూస్తున్నామని చంద్రబాబు తెలపగా… గ్రేట్ అంటూ బిల్ గేట్స్ ప్రశంసించారు. బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాల గురించి బిల్ గేట్స్ ఆరా తీశారు. రాజధాని నిర్మాణ తీరు గ్రేట్ వర్క్ అంటూ బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు.
