
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్ట్ 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని హెచ్చరించింది. పిడుగుపాటు హెచ్చరికల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, బయటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. బయట ఉన్నవారు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దంది. రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని అంచనా వేసింది.
ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా అల్పపీడనం ఏర్పడగా.. రాబోయే 12 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తోందని వాతావరణశాఖ ప్రకటించింది. ఇక తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 18వ తేదీ వరకు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. శుక్రవారం కోస్తాంధ్ర, రాయలసీమలో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 43.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. కురుపాంలో 38.6 మి.మీ, పార్వతీపురంలో 36.8 మి.మీ, పాతపట్నంలో 33.4 మి.మీ, వీరఘట్టంలో 32.6 మి.మీ, బాలాజీపేటలో 28.6 మి.మీ, పాలకొండలో 28.6 మి.మీ, రాజమండ్రిలో 28, జియ్యమ్మ వలసలో 25.8 మి.మీ, భీమడొలులో 18.4 మి.మీ, పాలసీలో 18.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
రుతుపవన ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రాబోయే వారం రోజుల పాటు వానలు పలు ప్రాంతాల్లో కురవనున్నట్లు హైదరాబాద్ వాతావణశాఖ ప్రకటించింది. తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాగల మూడు రోజులలో క్రింది స్థాయి ఉపరితల గాలుల వేగం 30 నుంచి 40 కి.మీ వరకు కొన్ని ప్రాంతాలలో కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీమ్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.