
బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ప్రారంభమైన ఈ ‘ధర్మ దీక్ష’కు పలు బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. గతంలో నిర్వహించిన “బీసీ సింహగర్జన” సభలో ప్రస్తావించిన ఐదు కీలక డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ దీక్షకు దిగినట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి, అణగారిన వర్గాల అభ్యున్నతి మరియు OBC రిజర్వేషన్ల కోసం పోరాడిన బీపీ మండల్ మనుమడు డా. సూరజ్ మండల్ హాజరై రామచంద్ర యాదవ్ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు జ్యోతిబా పూలే మనుమరాలు డా. ఎస్. పూలే మాట్లాడుతూ… బీసీ వర్గాల అభ్యున్నతి కోసం రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం అభినందనీయమని పేర్కొన్నారు. బీసీలందరి ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, అప్పుడే సమన్యాయం జరుగుతుందని వారు వ్యాఖ్యానించారు. అలాగే, ఈ ఉద్యమానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.