
అనుమానం అనే పెనుభూతం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే కాలయముడిగా మారి ఆరేళ్ల అనుబంధాన్ని కత్తితో కోసేసాడు. నెల్లూరు నగరంలోని పడారుపల్లి చెరువు సాక్షిగా జరిగిన ఈ కిరాతక ఉదంతం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడుకు చెందిన రేవతి, కడపకు చెందిన శ్రీకాంత్ గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, రేవతి వేరొక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందనే అనుమానం శ్రీకాంత్ మనసులో మొదలైంది. ఆమె తనను మోసం చేస్తోందని లోలోపల రగిలిపోయిన శ్రీకాంత్, ఎలాగైనా రేవతిని అంతమొందించాలని పక్కా ప్లాన్ వేశాడు.
‘ఒక్కసారి మాట్లాడాలి’ అంటూ రేవతిని నమ్మించి పడారుపల్లి చెరువు కట్ట వద్దకు పిలుచుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దాంతో ముందే దాచుకున్న పదునైన కత్తిని తీసి రేవతిపై విచక్షణా రహితంగా విరుచుకుపడ్డాడు. ఆమె ప్రాణభయంతో కేకలు వేస్తున్నా వినకుండా గుండెపై, శరీరంపై విచ్చలవిడిగా పొడిచేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రేవతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
హత్య చేసిన అనంతరం శ్రీకాంత్ పారిపోయే ప్రయత్నం చేయలేదు. చేతికి అంటిన నెత్తురుతో, రక్తపు కత్తితో నేరుగా వేదయపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. “నేనే చంపాను.. నన్ను అరెస్ట్ చేసుకోండి” అంటూ నిందితుడు చెప్పడంతో పోలీసులు సైతం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. రేవతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశం, అనవసర అనుమానం ఒకరిని స్మశానానికి, మరొకరిని జైలు పాలు చేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..