APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు పండుగే.. ప్రతీ డిపోలోనూ ఎలక్ట్రిక్ బస్సులు.. ముహూర్తం ఫిక్స్..
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడంపై దృష్టి సారించింది. ఇప్పటికే గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు సర్వీసులు అందిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్నద్దమవుతున్నారు. ప్రతీ బస్టాండ్లోనూ బస్సులు కనిపించనున్నాయి.

ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ప్రతీ డిపోలోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1050 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. డిసెంబర్ నాటికి ఈ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానుందని తెలుస్తోంది. అలాగే మొత్తం దశలవారీగా 5500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని చూస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటోంది. ప్రస్తుతం స్త్రీశక్తి పథకం అమలు చేయడం ద్వారా బస్సుల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. ఈ రద్దీని నివారించాలంటే ఎలక్ట్రిక్ బస్సులే సరైన మార్గమని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. అందుకనుగుణంగా చర్యలు చేపడుతోంది.
అక్టోబర్ నాటికి 350 ఎలక్ట్రిక్ బస్సులు
ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి 350 ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రంలో తిప్పాలని ఏపీఎస్ఆర్టీసీ లక్ష్యం పెట్టుకుంది. ఆ తర్వాత దశలవారీగా డిసెంబర్ నాటికి 1050 ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను తిప్పనుంది. భవిష్యత్తులో మొత్తం 5500 బస్సులను తీసుకురావాలని రంగం సిద్దం చేసుకుంటోంది. అయితే ఎలక్ట్రిక్ బస్సుల కోసం అన్ని డిపోల్లో ఆర్టీసీ అధికారులు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడేందుకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తోంది. ప్రయోగాత్మకంగా ఇప్పటికే కొన్ని సర్వీసులను అందుబాటులోకి తీసుకురాగా.. మరిన్ని సేవలను తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని ప్రతీ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. దీంతో ప్రతీ బస్టాండ్లోనూ ఇవి కనిపించనున్నాయి. ఇప్పటికే అన్ని బస్టాండ్లలో ఛార్జింగ్ స్టేషన్ల పనులు ఊపందుకున్నాయి.
ఎలక్ట్రిక్ బస్సులతో సమస్య పరిష్కారం
స్త్రీశక్తి పథకం ద్వారా ప్రభుత్వంపై రూ.3 వేల కోట్లకుపైగా భారం పడుతోంది. అయితే వెనకడుగు వేయకుండా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ కొనకొండ్ల నారాయణరావు తెలిపారు. అయితే స్త్రీశక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని, దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవడం లేదని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తే ఆ సమస్య తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఈ-బస్ సేవ పథకం కింద రాష్ట్రానికి 750 బస్సులను కేటాయించిందని, వీటిల్లో 300 బస్సులను జులైలోనే అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గుంటూరు, విజయవాడ, అమరావతి, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, కడప, అనంతపురం, కాకినాడ, రాజమండ్రిలో వీటిని ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి ప్రతీ డిపోలోనూ ఎలక్ట్రిక్ బస్సులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు.
