
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు(ఫిబ్రవరి 23న) ఎగ్జామ్ యధాతధంగా ఉంటుందని ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది.
ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ అంటే.. రేపు జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకుని కొద్దిరోజులపాటు పరీక్షలను వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీకి లేఖ రాసింది కూటమి సర్కార్. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్షల నిర్వహణపై అభ్యర్థులు కొద్దిరోజులుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఆందోళనలకు సైతం దిగారు. రోస్టర్ సరిచేస్తేనే ఏ విధమైన న్యాయసమస్యలు ఎదురుకావంటూ చెబుతూ వస్తున్నారు. మరోవైపు రోస్టర్ అంశంపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే నెల 11వ తేదీన విచారణకు రానుంది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవేట్ వేసేందుకు ఇంకా సమయం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను కొద్దిరోజులు వాయిదా వేయడం మంచిదని ఏపీ ప్రభుత్వం భావించింది. పరీక్షను వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి లేఖ రాసింది.
దీనిపై ఏపీపీఎస్సీ సెక్రటరీ తిరిగి ప్రభుత్వానికి లేఖ రాశారు. ఫిబ్రవరి 23న ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్ష యధాతధంగా జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు. పరీక్షలు వాయిదా వేయలేమని క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి