AP Panchayat Elections: ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌.. వైసీపీ అభ్యర్థులదే హవా..

| Edited By: Subhash Goud

Nov 14, 2021 | 9:46 PM

AP Panchayat Polls: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ పోరు ముగిసింది. కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వార్డు సభ్యుల ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. అయితే  నెల్లూరు..

AP Panchayat Elections: ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌.. వైసీపీ అభ్యర్థులదే హవా..

AP Panchayat Polls: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ పోరు ముగిసింది. కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వార్డు సభ్యుల ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. అయితే  నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం ముగిసింది. ఇందులో 36 సర్పంచ్‌, 68 పంచాయతీ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరిగాయి.  15న సోమవారం నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మున్సిపాలిటీల్లో 365 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ నెల 16న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తారు. 10 జడ్పీటీసీలు, 163 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగుతాయని అధికారులు తెలిపారు.

ఇవాళ మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. పోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా చర్యలు చేపట్టారు. మొత్తం 69 స్ధానాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇప్పటికే 30 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. 36 పంచాయితీల్లో ఇవాళ (ఆదివారం) సర్పంచ్‌ స్ధానాలకు ఎన్నికలు జరిగాయి.

ఏపీ మినీ పల్లె పోరును ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. పోలింగ్‌ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలించేందుకు వెబ్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. అంతే కాదు సీసీ కెమెరాలతోపాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Nov 2021 09:45 PM (IST)

    వార్డు అభ్యర్థుల గెలుపు

    తూర్పుగోదావరి జిల్లా అలమూరు గ్రామ పంచాయతీ 8వ వార్డులో వైసీపీ అభ్యర్థి ఎలుగు బట్ల సత్యనారాయణ గెలుపొందారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో రేగిడి ఆమదాలవలస మండలం తోకల వలస పంచాయతీలో వైసీపీ అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపొందారు.

  • 14 Nov 2021 08:51 PM (IST)

    ఏపీ పంచాయతీలో వైసీపీ అభ్యర్థులే..

    ఏపీ పంచాయతీ ఎన్నిల కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వార్డు అభ్యర్థుల ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లా, శ్రీకాకులం, విజయనగరం, ప్రకాశం, గుంటూరు, విశాఖ, చిత్తూరు, కర్నూలు, కృష్ణా, అంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన వార్డు సభ్యుల ఫలితాలు వెల్లడయ్యాయి.


  • 14 Nov 2021 07:28 PM (IST)

    విజయనగరం జిల్లాలో

    ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో భోగాపురం మండలం లింగాల సర్పంచ్‌ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బుగత లలిత 42 కోట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ7వ వార్డులో టీడీపీ అభ్యర్థి లెంక శ్రీనివాస్‌ 45 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నెల్లిమర్ల మండలం ఏటి అగ్రహారం సర్పంచ్‌ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మీసాల సూర్యకాంత 44 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • 14 Nov 2021 05:59 PM (IST)

    ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ హవా

    ఏపీలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీ హవా కొనసాగుతోంది. మొత్తం 69 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండగా..30 ఏకగ్రీవం అయ్యాయి. మరో మూడు చోట్ల ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. మిగిలిన 30 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఇక ఏకగ్రీవాలు పోగా మిగిలిన 68 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఎక్కువ మంది అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులే గెలుపొందుతున్నారు. ఇప్పటి వరకు కేవలం వార్డు సభ్యుల ఫలితాలు మాత్రమే వెలువడుతున్నాయి.

  • 14 Nov 2021 05:20 PM (IST)

    ప్రకాశం జిల్లాలో వార్డు సభ్యుల గెలుపు..

    ► కందులాపురం 6వ వార్డు అభ్యర్థి వరలక్ష్మీ విజయం
    ► మద్దిపాడు 5వ వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాస్‌ ఘన విజయం
    ► కొత్తపట్నంలో 7వ వార్డు వైసీపీ అభ్యర్థి పూరిణి సరోజిని గెలుపు
    ► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ గెలుపు
    ► ఇంకోల్లు మండలం పూసపాడులో 5వ వార్డులో టీడీపీ అభ్యర్థి గోరంట్ల లక్ష్మీ తులసి గెలుపు

  • 14 Nov 2021 05:11 PM (IST)

    గెలుపు బాటలో వైసీపీ అభ్యర్థులు

    సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. మరి కొంత మంది అభ్యర్థులు అధిక్యంలో ఉంటూ గెలుపు బాటలో కొనసాగుతున్నారు.

  • 14 Nov 2021 04:06 PM (IST)

    కృష్ణా జిల్లాలో వార్డు సభ్యుడి గెలుపు

    కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరులో 3వ వార్డు మెంబర్‌ వైఎస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

  • 14 Nov 2021 03:54 PM (IST)

    రాయదుర్గం మండలంలో వైసీపీ వార్డు సభ్యురాలి గెలుపు

    రాయదుర్గం మండలం ఉడేగోళం గ్రామంలో 5వ వార్డు మెంబర్‌ వైసీపీ అభ్యర్థి రామలక్ష్మీ విజయం సాధించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. పూర్తి ఫలితాలు రాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది.

  • 14 Nov 2021 03:53 PM (IST)

    అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థి గెలుపు

    ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లిలో 4వ వార్డు వైసీపీ అభ్యర్థి శంకరమ్మ గెలుపొందారు.

  • 14 Nov 2021 03:52 PM (IST)

    వైసీపీ అభ్యర్థి విజయం

    పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా నెల్లూరు జిల్లాలో మనుబోలు మండలం వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్‌ సీపీ బలపర్చిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం సాధించారు.

  • 14 Nov 2021 02:59 PM (IST)

    రాత్రి వరకు పూర్తి ఫలితాలు

    ఏపీ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొత్తం 69 సర్పంచ్ స్థానాలు ఖాళీగా ఉండగా..30 ఏకగ్రీవం అయ్యాయి. మరో మూడు చోట్ల ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు. మిగిలిన 30 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. ఇక ఏకగ్రీవాలు పోగా మిగిలిన 68 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. దాదాపు లక్ష మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ ప్రోటాకల్ తప్పనిసరి చేశారు. ఇప్పుడు కౌంటింగ్‌ ప్రారంభమైంది. రాత్రి వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

  • 14 Nov 2021 02:56 PM (IST)

    ప్రారంభమైన కౌంటింగ్‌

    ఏపీలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. 36 సర్పంచ్ స్థానాలు, 68 వార్డులకు కౌంటింగ్‌ జరుగుతోంది. రాత్రికి పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది.

  • 14 Nov 2021 02:34 PM (IST)

    పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్‌

    గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌.. కొద్దిసేపట్లో కౌంటింగ్‌ ప్రారంభం కానుంది.

  • 14 Nov 2021 11:58 AM (IST)

    అంబడిపూడిలలో..

    సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో రెండు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పాకాలపాడు, అంబడిపూడిలలో సర్పంచ్ స్థానాలకు ఎన్నిక సజావుగా జరిగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశాం.. కౌంటింగ్ తరువాత గెలిచిన అభ్యర్ధులు ర్యాలీలు నిషేధం.

  • 14 Nov 2021 11:56 AM (IST)

    పోలింగ్ కేంద్రం వద్ద డ్రోన్లతో నిఘా..

    ఏజెన్సీలో పలుచోట్ల భారీభద్రత మధ్య సర్పంచ్ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. పెదబయలు మండలం గిన్నెలకోట, ముంచంగిపుట్టు మండలం జర్రెల, కొయ్యూరు మండలం బాలారం సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత.. డ్రోన్లతో నిఘా పెట్టారు పోలీసులు.

  • 14 Nov 2021 11:55 AM (IST)

    వృద్ధులు సైతం…

    ఘంటసాల మండలం మల్లంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. మల్లంపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంకు వృద్ధులు సైతం తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

  • 14 Nov 2021 11:54 AM (IST)

    ఉదయం 11 గంటల వరకు…

    ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నరిశెట్టివారిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటల వరకు 305 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని ఎటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టారని ఎన్నికల జోనల్ అధికారి తిరుపతి రెడ్డి అన్నారు.

  • 14 Nov 2021 11:53 AM (IST)

    వర్షంలో కొనసాగుతున్న

    ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నరిశెట్టివారిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ వర్షంలో కొనసాగుతూ ఉంది. గతంలో గ్రామంలో నెలకొని ఉన్న రెవిన్యూ సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదంటూ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. అనంతరం వారి సమస్యలను పరిష్కరిస్తామనే హామీ మేరకు ఈ ఎన్నికలలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు.

  • 14 Nov 2021 11:44 AM (IST)

    పశ్చిమ గోదావరి జిల్లాలో..

    పశ్చిమ గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న మూడు సర్పంచ్‌, ఏడు వార్డులకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. పెదమల్లం, పుట్లగట్లగూడెం, పుల్లాయిగూడెం గ్రామ సర్పంచ్‌ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది.

  • 14 Nov 2021 11:27 AM (IST)

    విశాఖ జిల్లా రేఖవానిపాలెంలో..

    విశాఖ జిల్లా రేఖవానిపాలెం సర్పంచ్ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్ర వద్ద ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాన్ని నార్త్ డివిజన్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాసరావు పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. 40 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.

  • 14 Nov 2021 11:07 AM (IST)

    కర్నూలు జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలు..

    కర్నూలు జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలు, రెండు వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం, క్రిష్ణగిరి మండలం లక్కసాగరం, బెలగల్ మండలం యిన గండ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు, సిరివెళ్ల, భీమవరం గ్రామాల్లో రెండు వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 14 Nov 2021 10:52 AM (IST)

    ఓటు వేసేందుకు..

    కర్నూలు జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలు, రెండు వార్డులకు పోలింగ్ జరుగుతోంది. ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం, క్రిష్ణగిరి మండలం లక్కసాగరం, బెలగల్ మండలం యిన గండ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు, సిరివెళ్ల, భీమవరం గ్రామాల్లో రెండు వార్డులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • 14 Nov 2021 10:35 AM (IST)

    రెండు రోజుల పాటు అద్దె కావాలి.. ఎంతైనా నో ఇష్యూ..

    కుప్పంలో అద్దె ఇళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఎన్నికల ప్రచారం ముగిసినా స్థానికేతరులు కుప్పంలో నే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు స్థానికేతరులను ఖాళీ చేయించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. పలు హోటళ్ల నుంచి స్థానికేతరులను ఖాళీ చేయించారు. రహస్యంగా ఇళ్లల్లో మకాం పెట్టేందుకు స్థానికేతరులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ రోజు, రేపు ఖాళీగా ఉన్న ఇళ్లకు వేలాది రూపాయల అద్దె చెల్లించేందుకు సిద్ధమైన స్థానికేతరులు. స్థానికేతరులను ఖాళీ చేయించి కుప్పంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ఎన్నికల సంఘానికి స్థానికులు లేఖలు, మెసేజ్ లు.
    కుప్పంలో స్థానికేతరుల గుర్తింపు కోసం జల్లెడ పడుతున్న పోలీసులు.

  • 14 Nov 2021 10:27 AM (IST)

    ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు

    అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది.. పోలింగ్ సెంటర్ల వద్ద ఇప్పుడిప్పుడే ఓటర్ల తాకిడీ కనిపిస్తోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.

  • 14 Nov 2021 09:15 AM (IST)

    మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు..

    సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించి.. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు.

  • 14 Nov 2021 09:08 AM (IST)

    బ్యాలెట్‌ విధానంలో పోలింగ్..

    మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్‌ విధానంలో జరుగుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఇవాల  మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు.

  • 14 Nov 2021 09:07 AM (IST)

    మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలకు..

    మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్‌ కొనసాగనుంది. ఇక ఆదివారం జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్‌ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు.

  • 14 Nov 2021 08:12 AM (IST)

    ఎన్నికల కమిషన్‌కు టీడీపీ ఫిర్యాదు.. కుప్పంలో ప్రచారం ముగిసినా.. ఇంకా బయటి వ్యక్తులు

    అమరావతి ఎన్నికల కమిషన్‌కి టీడీపీ పిర్యాదు చేసింది. కుప్పంలో ప్రచారం ముగిసినా బయట వ్యక్తులు ఉన్నారని తన  పిర్యాదులో పేర్కొంది తెలుగు దేశం. బయట నియోజకవర్గాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. వారిలో వైసీపీ నేతలు, డ్వామా ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు సిబ్బంది ప్రచారం నిర్వహిస్తున్నారని పిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే  చర్చలు తీసుకోవాలని కోరిన టీడీపీ కోరింది.

     

  • 14 Nov 2021 08:10 AM (IST)

    పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు..

    పోలింగ్‌ సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయా పంచాయతీల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం వరకు కొనసాగనుంది.

  • 14 Nov 2021 08:09 AM (IST)

    కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర కోవిడ్‌ ప్రోటోకాల్‌ మస్ట్..

    పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతంది. రాత్రి వరకు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఇదలావుంటే.. పోలింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. ఏపీ స్థానిక ఎన్నికల్లో కోవిడ్‌ రూల్స్‌ తప్పనిసరి అని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిశారు ఎస్‌ఈసీ నీలం సాహ్ని.  కౌంటింగ్‌ కేంద్రాల దగ్గర కోవిడ్‌ ప్రోటోకాల్‌ మస్ట్ అని చెప్పారు.

  • 14 Nov 2021 08:07 AM (IST)

    ప్రారంభమైన పోలింగ్.. ఓటుహక్కు వినియోగించుకోనున్న లక్ష మంది ఓటర్లు..

    ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్  మొదలైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది. గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 30 సర్పంచ్‌ స్థానాలు, 380 వార్డులు ఏకగ్రీవం, 36 సర్పంచ్ స్థానాలు, 68 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికలు జరుగుతున్న చోట మొత్తం 88 మంది సర్పంచ్‌ అభ్యర్థులు బరిలో ఉన్నారు. లక్ష మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.  ఇందు కోసం 350 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేశారు

  • 14 Nov 2021 08:04 AM (IST)

    అనంతపురం జిల్లాలో ఎన్నికలు జరిగే సర్పంచ్ స్థానాలు ఇవి..

    అనంతపురం జిల్లాలో ఎన్నికలు జరిగే సర్పంచ్ స్థానాలు ఇలా ఉన్నాయి. వాటిలో పుట్లూరు మండలం- కంది కాపుల,
    రొద్దం మండలం -చిన్నమంతూరు,  శెట్టూరు మండలం -కైరేవు, లేపాక్షి మండలం – కంచిసముద్రం ఉన్నాయి. ఇక్కడ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది.

  • 14 Nov 2021 08:03 AM (IST)

    అనంతపురం జిల్లాలో నేడు గ్రామ పంచాయతీ..

    అనంతపురం జిల్లాలో నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.  4సర్పంచ్ స్థానాలకు, 2 వార్డు స్థానాలకు ఎన్నికలు, ఇప్పటికే 29వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.  ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది.

Follow us on