
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మున్సిపల్ సమరానికి అత్యంత కీలకమైన వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాలను అధికారికంగా ప్రచురించనున్నారు. ఇందులో 12 ప్రముఖ మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు మరియు నగర పంచాయతీలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ పోరుకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంది.
రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులతో పాటు ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాల రూపకల్పన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 22న ఈ జాబితాలు బహిర్గతం కానుండటంతో ఆయా కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత రానుంది. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో మేయర్ స్థానాలతో పాటు డివిజన్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఈ ఓటర్ల లెక్కలే కీలకం కానున్నాయి.
కార్పొరేషన్లతో పాటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ సెప్టెంబర్ 22న ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా నుంచి రాయలసీమ వరకు విస్తరించి ఉన్న పార్వతీపురం, సాలూరు, నర్సీపట్నం, పిఠాపురం, రామచంద్రాపురం, పెదన, జగ్గయ్యపేట, మాచర్ల, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండ, చీరాల, మార్కాపురం, పుత్తూరు, పలమనేరు, నగరి తదితర పట్టణాలు ఈ లిస్ట్లో ఉన్నాయి. వీటితో పాటు రాయచోటి, ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, జమ్మలమడుగు, యర్రగుంట్ల, కమలాపురం, రాయదుర్గ్, తాడిపత్రి, ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, నంద్యాల మున్సిపాలిటీల ఓటర్ల వివరాలు ఆ రోజున విడుదల కానున్నాయి.
ఈ వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల రూపకల్పనకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం జనవరి 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించారు. ఇటీవల నిరంతర సవరణల ద్వారా అప్డేట్ చేసిన అసెంబ్లీ ఓటర్ల జాబితాలను ప్రాతిపదికగా తీసుకుని, వార్డుల సరిహద్దులకు అనుగుణంగా ఓటర్ల వివరాలను విభజించి పొందుపరుస్తున్నారు. ఆయా పట్టణాల్లో డీలిమిటేషన్ ప్రక్రియ ముగియడంతో ఓటర్ల జాబితాల తయారీ నిరాటంకంగా సాగుతోంది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే పలు దశల్లో వేగం పుంజుకుంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో సెప్టెంబర్ 3నే వార్డుల వారీ ఓటర్ల జాబితాల ప్రచురణ పూర్తయింది. అలాగే డీలిమిటేషన్ పూర్తయిన మొత్తం 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఇప్పటికే 58 పట్టణాల్లో ఓటర్ల జాబితాల ప్రక్రియ ముగిసింది. తాజాగా మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 22న జాబితాలు ప్రచురిస్తుండటంతో పట్టణ పోరుకు సంబంధించిన కీలక ఘట్టం పూర్తికానుంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు కనిపిస్తుండటంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది.