Andhra: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో కొత్త అధ్యాయం.. సమూల మార్పులు

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తరగతి గదుల్లో పాఠం చెప్పే విధానంలో పాఠశాల విద్యాశాఖ మార్పులు తీసుకొస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యం మెరుగు పరచడంతోపాటు బోధన పద్ధతులను పిల్లలు నేర్చుకునే విధానాల్లో శాశ్వత మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇంటరాక్టివ్ క్లిక్కర్ సిస్టంతో చదువులు చెప్పే విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది ఏపీ సర్కార్. అసలేంటి క్లిక్కర్?. స్కూల్స్‌లో ఎలా అమలవుతోంది?.

Andhra: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో కొత్త అధ్యాయం.. సమూల మార్పులు
Andhra Schools

Updated on: Mar 09, 2026 | 1:46 PM

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు ఇప్పుడు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నాయి. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రభుత్వ పాఠశాలల్లో క్లిక్కర్స్ ప్రోగ్రాం అమలు అవుతోంది. గతేడాది డిసెంబర్ 5న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్‌లో ఈ ప్రోగ్రాంను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 52 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ప్రోగ్రాం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో లోటుపాట్లను తెలుసుకొని స్టేట్ లెవెల్ వర్క్ షాప్‌తో వాటిని అధిగమించాలన్న పక్కా ప్లాన్‌తో ఉన్న పాఠశాల విద్యాశాఖ అన్ని పాఠశాలల్లో క్లికర్స్ ప్రోగ్రాంను అమలు చేయబోతోంది.

ప్రతి విద్యార్థికి చెప్పే పాఠం అర్థం అవుతుందా లేదా అన్న విషయాన్ని రియల్ టైంలో తెలుసుకునే అవకాశం ఈ క్లిక్కర్‌తో అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ బేస్డ్ రివిజన్ టూల్‌గా క్లిక్కర్‌ను విద్యార్థుల చేతికి అందించారు. సమ్మరీ ప్రోగ్రాం, క్విజ్ నిర్వహించడంతో పాటు.. విద్యార్థులకు అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేసి తెలుసుకునే వెసులుబాటు క్లిక్కర్‌తో కల్పిస్తోంది విద్యాశాఖ. డిజిటల్ స్క్రీన్ ఉన్న తరగతి గదిలో ప్రతి విద్యార్థి చేతిలో రిమోట్ అందుబాటులోకి వచ్చింది. ఆన్సర్ చేసేందుకు మల్టిపుల్ ఛాయిస్, హ్యాండ్ రైజ్ చేసి డౌట్ క్లియర్ చేసుకునే అవకాశం అందుబాటులో రావడంతో ఈ బోధనా విధానం విద్యార్థులను ఆకట్టుకుంటోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఎస్పీజేఎన్ఎం మున్సిపల్ స్కూల్‌తో పాటు చిత్తూరు PNC మున్సిపల్ స్కూల్, తవణంపల్లి జడ్పీ హైస్కూల్‌లో క్లిక్కర్ ప్రోగ్రాం అమల్లో ఉంది. విద్యార్థులకు తరగతి గదిలో బోర్ కొట్టే ప్రోగ్రాంగా కాకుండా యాక్టివ్ గా పాల్గొనేలా చేయడంతో విద్యార్థులలో అభ్యసన నైపుణ్యాలు పెంపొందించేందుకు టీచర్స్ ప్రయత్నిస్తున్నారు. బోధనతోపాటు విద్యార్థులకు సమ్మరీ వీడియో ప్రదర్శన ఆ తరువాత విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహిస్తున్నారు. స్టూడెంట్స్ నేర్చుకునే పాఠంపై ఫోకస్ చేసేలా చేయడంలో టీచర్స్ సక్సెస్ అవుతున్నారు. ప్రతి విద్యార్థి చేతిలో ఉన్న రిమోట్ ద్వారా సమాధానాలు క్లిక్ చేయడంతో.. ఎంతమంది విద్యార్థులు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, ఎంతమంది తప్పు ఆన్సర్ చెప్పారనేది సెకన్ల వ్యవధిలో తెలుసుకోవచ్చు.

ఏ విద్యార్థికి పాఠ్యాంశం అర్థమైంది, ఎవరికి అర్థం కాలేదన్న విషయం క్లిక్కర్ ద్వారా ఉపాధ్యాయులకు తెలుస్తుంది. విద్యార్థులకు అర్థం కాని పాఠ్యాంశాన్ని రిపీట్ చేస్తున్నారు. క్లిక్కర్‌తో విద్యార్థుల్లో పోటీ తత్వం పెరగడంతో పాటు హాజరుశాతం కూడా పెరిగిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

గతంలో పాఠశాల విద్యాశాఖ అమలు చేసిన వీడియో పాఠాలకు భిన్నంగా క్లికర్స్ ప్రోగ్రాం అమలు అవుతోందని టీచర్స్ అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ తరగతి గది సత్ఫలితాలను ఇస్తోందని ఉపాధ్యాయులు సంతృప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో రెండు పాఠశాలలు పైలెట్ ప్రాజెక్టుగా అమలు అవుతున్న క్లిక్కర్స్ ప్రోగ్రామ్.. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని స్కూళ్లలో అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం.

Follow Us