
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం ఏపీ సర్కార్ భారీగా అదనపు నిధులను మంజూరు చేసింది. అంగన్వాడీ మెయిన్, మినీ కార్యకర్తలతో పాటు సహాయకులకు ఈ బెనిఫిట్స్ అందించేందుకు గానూ ఏకంగా రూ.19,70,48,000 అదనపు నిధులను కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధుల విడుదలకు సంబంధించి మహిళలు, బాలలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కీలక ఉత్తర్వుల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల చెల్లింపుల కోసమే ప్రత్యేకంగా ఈ నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాధారణంగా నిధుల విత్డ్రాపై ఉండే ఆర్థికపరమైన ఆంక్షలను ఈ విడతలో ప్రభుత్వం పక్కన పెట్టింది. అంగన్వాడీలకు త్వరితగతిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో ట్రెజరీ నియంత్రణ, త్రైమాసిక నియమాలను సడలించి, ఈ నిధులను వెంటనే వినియోగించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతానికి అడ్వాన్స్గా ఇస్తున్న ఈ మొత్తాన్ని రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ప్రకారం.. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కూడా గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, 1972 కింద రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు అర్హులని స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం, రాష్ట్రవ్యాప్తంగా పదవీ విరమణ పొంది ఆర్థిక సాయం కోసం వేచి చూస్తున్న వేలాది మంది అంగన్వాడీలకు పెద్ద ఊరటనివ్వనుంది. ఈ నిధులను నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు చేరవేసే బాధ్యతను మహిళల అభివృద్ధి, బాల వికాస శాఖ డైరెక్టర్కు అప్పగిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మొత్తాన్ని సంబంధిత హెడ్ ఆఫ్ అకౌంట్లో డెబిట్ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు.
కాగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తూ రాత్రింబవళ్లు సేవలందిస్తున్న అంగన్వాడీల సంక్షేమానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తాజా జీవోతో వేలాది కుటుంబాల్లో రిటైర్మెంట్ భరోసా లభించినట్లయింది.