ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కిలో ఉల్లి రూ.35కే! పప్పు, పామాయిల్‌పైనా ధరల తగ్గింపు!

ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. కిలో ఉల్లిపాయలను ₹35కే రైతు బజార్లలో విక్రయించనుంది. పామాయిల్‌పై ₹10 వరకు, కందిపప్పుపై కూడా ధరలు తగ్గించనుంది. ఇప్పటికే బియ్యం సరఫరా ద్వారా లక్ష మందికి పైగా లబ్ధి పొందారు. వినియోగదారులకు ఊరట కల్పించి, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కిలో ఉల్లి రూ.35కే! పప్పు, పామాయిల్‌పైనా ధరల తగ్గింపు!
Ap Essential Prices Down

Updated on: Sep 04, 2026 | 10:22 AM

అమరావతి: నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్యులపై భారం పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరగడంతో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు కిలో ఉల్లిపాయలను రూ.35కే విక్రయించేలా చర్యలు చేపడుతోంది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే ఉల్లిని అందుబాటులోకి తీసుకురావాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. నిత్యావసరాల ధరల నియంత్రణపై మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. మార్కెట్‌లో ధరల పెరుగుదలకు కారణాలు, వినియోగదారులకు తక్కువ ధరలకు సరుకులు అందించే మార్గాలపై సమీక్షించింది.

NCCF ద్వారా ఉల్లి సరఫరా

కేంద్ర ప్రభుత్వ సంస్థ NCCF సహకారంతో అవసరమైన పరిమాణంలో ఉల్లిపాయలను రాష్ట్రానికి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా రూ.35కే కిలో చొప్పున వినియోగదారులకు అందించనున్నారు. సరఫరా ప్రారంభమైన తర్వాత ధరల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు.

పామాయిల్, కందిపప్పుపైనా ఫోకస్

ఉల్లితో పాటు పామాయిల్, కందిపప్పు ధరలను కూడా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మార్కెట్ ధరతో పోలిస్తే పామాయిల్‌ను రూ.10 వరకు తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కందిపప్పు ధర తగ్గింపుపై కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కందిపప్పు సరఫరా కోసం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నుంచి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల కందులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వీటిని సేకరించి, ప్రాసెసింగ్ అనంతరం రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరసమైన ధరలకు విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.

బియ్యం విక్రయాల్లోనూ భారీ స్పందన

ఇప్పటికే బియ్యం ధరలను నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 651 ప్రత్యేక కౌంటర్లు, రైతు బజార్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు 10,163 క్వింటాళ్ల బియ్యం విక్రయించగా, లక్ష మందికి పైగా వినియోగదారులు ప్రయోజనం పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే వినియోగదారుల్లో ఆదరణ ఉన్న KNM రకం బియ్యాన్ని 10,000 మెట్రిక్ టన్నులు నెల్లూరు జిల్లా రైస్ మిల్లర్ల నుంచి సేకరించి ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందించాలని నిర్ణయించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమ నిల్వలు చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక శాఖల సమన్వయంతో నిత్యావసరాల ధరలు, నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.

మొత్తంగా.. ఉల్లి, కందిపప్పు, పామాయిల్, బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ చర్యలను వేగవంతం చేస్తోంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ధరల నియంత్రణపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us