Jagan letter to Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ.. వివరాలు

ఇళ్ల నిర్మాణం కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను లేఖలో వివ‌రించిన సీఎం జగన్..

Jagan letter to Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ.. వివరాలు
Cm Jagan

Updated on: Jun 08, 2021 | 10:51 AM

Jagan Mohan Reddy writes to PM Narendra Modi : ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి లేఖ‌ రాశారు. గ్రీన్‌ఫీల్డ్ కాల‌నీల్లో మౌలిక‌స‌దుపాయాలు క‌ల్పించాల‌ని ముఖ్యమంత్రి తన లేఖ‌లో కోరారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను లేఖలో వివ‌రించిన సీఎం జగన్.. ఏపీలో 30 ల‌క్ష‌ల మందికి ఇళ్ల క‌ల్ప‌న ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు ప్రధానికి వెల్ల‌డించారు. ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం సుస్థిరాభివృద్ధికి దోహదం చేస్తుందని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై ప్రధానికి లేఖలో వివరించారు. 2022 కల్లా ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ పథకం పూర్తి చేయాలన్న ప్రధాని మోదీ సంకల్పం చాలా గొప్పదని సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు..

‘‘ఏపీ ప్రభుత్వం 68,381 ఎకరాల భూమిని పేదలకు పంచింది.17,005 గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ కాలనీల్లో 28.35 లక్షల పక్కాఇళ్లను నిర్మించేందుకు సంకల్పించాం. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవైలో భాగంగా మౌలిక వసతులు కల్పించాలి. ఇందుకోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయి. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణాల కోసం ఇప్పటికే రూ.23,535 కోట్లు ఖర్చు చేశాం. ఇంత మొత్తం వెచ్చించడం రాష్ట్రానికి భారం అవుతుంది. మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రానికి అండగా ఉండాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

అదే విధంగా ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలకు పీఎంఏవై కింద ఏపీకి సమృద్దిగా నిధులు వచ్చేలా ఆదేశించాలని సీఎం వైఎస్‌ జగన్‌, ప్రధాన మంత్రి నరేం‍ద్ర మోదీని కోరారు. ఇలా ఉండగా, ఈనెల 3వ తేదీన ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుందని సీఎం జగన్ ఆ సందర్భంగా స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని మొదటి దశలో ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు.

ఆంధప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తోన్నవైయ‌స్ఆర్ – జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కాగా, అన్ని వసతులతో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, రాళ్లు, సిమెంటు, ఇటుకలు, విద్యుత్‌ సప్లై, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, నీటి వసతులను కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రచించి డీపీఆర్‌ లు సిద్ధం చేస్తున్నారు.

ప్రతి లేఅవుట్‌ కు సంబంధించిన సమగ్ర వివరాలను సమకూర్చుకోవాలని.. ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్‌ నాటికి మొదటి దశ ఇళ్ల నిర్మాణం పనులు పూర్తిచేయాలని అందుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పన కార్యక్రమాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జగనన్న కాలనీల్లో అంతర్గత రోడ్డు, కరెంటు, తాగునీరు అంగన్వాడీ కేంద్రాలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తోపాటు అన్ని మౌలిక వసతులు కల్పించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంలో చురుకైన పాత్ర పోషించాలని అధికారులను ఆదేశించారు.. ఆ దిశగా ఏపీలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు సాయం కోసం నిధులు ఇవ్వాలంటూ ఇవాళ జగన్.. ప్రధానికి లేఖ రాశారు.

Read also : Sanjana Galrani : అన్నార్తులకు కొవిడ్ వేళ సినీనటి సంజన గల్రానీ ఆపన్నహస్తం.. దాదాపు నెల్లాళ్లుగా ఉచిత భోజన సేవ

Loading...
Unable to load recommendations.
Follow Us