Chandrababu: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం

|

Jul 24, 2024 | 5:13 PM

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకీ సిఫార్సు చేస్తామని వివరించారు. మద్యం విక్రయాల్లో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని.. దాని కోసం సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

Chandrababu: చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం
Chandrababu Pawan Kalyan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకీ సిఫార్సు చేస్తామని వివరించారు. మద్యం విక్రయాల్లో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని.. దాని కోసం సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. లావాదేవీల్లో జరిగిన అవకతవకలు బయటకు తీస్తామని.. స్పష్టంచేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం ఎక్సైజ్‌ శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నేరస్థులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరాలమయమవుతాయన్నారు. తాము విడుదల చేస్తోన్న 7 శ్వేతపత్రాలు చూస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో తెలుస్తుందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. మద్యపాన నిషేధం, లిక్కర్‌ ఔట్‌లెట్స్‌ తగ్గింపు అని చెప్పి అన్నీ మరిచారని విమర్శించారు. ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలని పేర్కొన్నారు. మద్యం అనేది ఒక వ్యసనమని.. పేదవాడు శారీరకంగా కష్టపడి బాధలు మర్చిపోయేందుకు తాగుతారని.. వారి అలవాటును బలహీనంగా చేసుకొని దోచుకున్నారంటూ విమర్శించారు.

తప్పు చేసినవారికి శిక్షపడాల్సిందే: పవన్ కల్యాణ్..

ఈ చర్చలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మాట్లాడారు. గత ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని తప్పుబట్టిన పవన్ కల్యాణ్.. గత ఎక్సైజ్ పాలసీలో రూ.18వేల కోట్ల అవకతవకలు జరిగాయన్నారు. అసెంబ్లీలో సమాధానం చెప్పాల్సి వస్తుందని.. వైసీపీ సభ్యులు తప్పించుకుని పారిపోయారని విమర్శించారు. తప్పు చేసినవారికి శిక్షపడాల్సిందేనని.. పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఏపీలో మద్యపాన నిషేధం అసాధ్యమని.. మద్యానికి బానిసలైన వారి కోసం.. డీఅడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పవన్ సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..