
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి 25 లక్షల వరకూ హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని కోటి 63 లక్షల కుటుంబాలకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది.
యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ విధానంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25లక్షల రూపాయల వరకూ ఉచిత చికిత్సలు అందుతాయి. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని కోటి 63 లక్షల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. 2 వేల 493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. మొత్తం 3 వేల 257 చికిత్సలకు హైబ్రిడ్ విధానంలో ఉచితంగా వైద్యం అందుతుంది. కేవలం ఆరు గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ చేయనున్నారు. 2 లక్షల 50 లోపు వైద్య చికిత్సల క్లెయిమ్లు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం రూపొందించారు. 2 లక్షల 50 వేల నుంచి 25 లక్షల రూపాయల వరకూ వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుంది. కోటి 43 లక్షల పేద కుటుంబాలు, 20 లక్షల ఇతర కుటుంబాలకూ వర్తించేలా నూతన హెల్త్ పాలసీని తీసుకువస్తోంది ప్రభుత్వం.
మరోవైపు కొత్త వైద్యశాలల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆర్ఎఫ్పీ జారీ చేసేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..