Ongole: రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి.. కిందకు దించేసిన టీసీ.. అతడి బ్యాగ్ చెక్ చేయగా

|

May 23, 2022 | 3:40 PM

పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న పొన్నయ్యను టీటీఈ గుర్తించారు. ఒంగోలు స్టేషన్‌లో అతడిని ట్రైన్ నుంచి దించేశారు.

Ongole: రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తి.. కిందకు దించేసిన టీసీ.. అతడి బ్యాగ్ చెక్ చేయగా
representative image
Follow us on

Andhra Pradesh: ఏ రవాణా వాహనం చెక్ చేసినా అదే.. ఏ పార్శిల్ పొట్లం విప్పినా అదే.. బైక్ సీటు కిందా అదే.. కారు డిక్కీలో అదే. అదే.. అదే అంటున్నారు.. ఏంటో చెప్పరేంటి అనుకుంటున్నారా..? చెప్పడానికి ఇంకేముందండీ బాబు.. గుప్పున పీలిస్తే మత్తును నషాలానికి ఎక్కించే గంజాయి. ఏం స్మార్ట్ అయ్యారురా బాబు..  అనాల్సిందే స్మగ్లర్స్ వాడుతున్న తెలివితేటలు చూస్తుంటే. అయితే పోలీసులు కూడా ముల్లును.. ముల్లుతోనే తీయాలన్నట్లు.. అంతే స్మార్ట్‌గా తనిఖీలు చేపడుతూ కేటుగాళ్లకు చెక్ పెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు లారీల్లో, బస్సుల్లో, కారుల్లో గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డవారిని చూశాం. ఓడల్లో ఈ దిక్కుమాలిన మత్తును రవాణా చేస్తుండగా కూడా అధికారులు పట్టుకున్నారు. ఇక కార్గో విమానాల్లో పార్శిల్స్ రూపంలో గంజాయి రవాణా చేయాలని చూసి చాలామంది బుక్కయ్యారు. తాజాగా ఓ వ్యక్తి ఇంకాస్త స్మార్ట్‌గా ఆలోచించాడు. ఏకంగా రైల్లోనే గంజాయి స్మగ్లింగ్‌కు పూనుకున్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి నుంచి ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు ఆదివారం 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిఆర్‌పి సిఐ రామారావు, ఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ హేరా లాల్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని మూర్తి పెరియ పొన్నయ్యగా గుర్తించారు. అతడు తమిళనాడు(Tamil Nadu)లోని తేని జిల్లా(Theni district) తేవరం గ్రామానికి చెందినవాడు.  చెన్నైకి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నాడు.

శనివారం పినాకిని ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న పొన్నయ్యను టీటీఈ( Traveling Ticket Examiner) గుర్తించారు. ఫైన్ కట్టకపోవడంతో..  ఒంగోలు స్టేషన్‌లోనే టీటీఈ అతడిని రైలు నుంచి దించేశాడు. ఆ సమయంలో జీఆర్‌పీ సీఐ రామారావు, సిబ్బంది సాధారణ తనిఖీలు చేస్తున్నారు. పొన్నయ్య కదలికలపై వారికి అనుమానం కలిగింది. దీంతో అతడి లగేజీని చెక్ చేయగా  బ్యాగ్‌లో 10 కిలోల గంజాయి బయటపడింది. వారు అతనిని అదుపులోకి తీసుకొని విచారణ కోసం రైల్వే పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం ఆర్పీఎఫ్ సిబ్బంది సహకారంతో కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..