YSR Zero Interest Loan Scheme 2021: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్, జగన్ సర్కారు కీలక నిర్ణయం

|

Apr 19, 2021 | 11:34 AM

రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది.

YSR Zero Interest Loan Scheme 2021: ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్, జగన్ సర్కారు కీలక నిర్ణయం
AP farmers
Follow us on

YSR Zero Interest Loan Scheme 2021: రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం కింద రబీ–2019లో అర్హత పొందిన రైతులకు సున్నా వడ్డీ రాయితీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. ఇందులో భాగంగా రబీ–2019 సీజన్‌కు ఆ నిబంధనతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ వడ్డీ రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని 6,27,908 మంది రైతులకు రూ.128.47 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ నెల 20న నేరుగా వారి ఖాతాల్లో ఈ మొత్తాలను జమ చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది.

రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు వర్తింపు

వ్యవసాయ అవసరాల కోసం రూ.లక్షలోపు పంట రుణాన్ని తీసుకుని సకాలంలో వాయిదాలు చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీ దక్కేది. రైతులు కట్టిన 4 శాతం వడ్డి మొత్తాన్ని ‘వడ్డీ లేని రుణ పథకం’ కింద గతంలో బ్యాంకులకు జమ చేసేవారు. రుణాలు సకాలంలో చెల్లించినప్పటికీ ఎప్పుడో రెండు మూడేళ్లకు ప్రభుత్వం జమ చేసే ఈ మొత్తాన్ని అప్పులిచ్చే సమయంలో బ్యాంకర్లు సర్దుబాటు చేసుకునే వారు.

ఈ పథకం కింద 14.25 లక్షల మంది అర్హత

అయితే, రూ.లక్షలోపు పంట రుణాలపై రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖరీఫ్‌–2019 సీజన్‌లో 43,28,067 మంది రుణాలు పొందగా.. వారిలో 25,96,840 మంది రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారున్నారు. నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా చెల్లించిన 14.25 లక్షల మంది ఈ పథకం కింద అర్హత పొందారు. వీరికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ కింద గతేడాది నవంబర్‌లో రూ.289.41 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది.

6,27,906 మంది రైతులకు రూ.128.47 కోట్లు

రబీ–2019–20 సీజన్‌లో 28,08,830 మంది రుణాలు పొందగా.. వారిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారు 16,85,298 మంది ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన వారిలో ఇప్పటివరకు 6,27,908 మంది రైతుల వివరాలను సున్న వడ్డీ పథకం రుణాలు (ఎస్‌వీపీఆర్‌) పోర్టల్‌లో బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేశారు. వాస్తవ సాగుదారులకు మాత్రమే వడ్డీ రాయితీ అందించాలన్న సంకల్పంతో ఈ జాబితాను ఈ–క్రాప్‌తో సరిపోల్చి 2,50,550 మంది రైతులను వ్యవసాయ శాఖ అర్హులుగా గుర్తించింది. రైతులకు సాయం చేసే విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. దీంతో బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేసిన 6,27,906 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వీరందరికీ ఈ నెల 20వ తేదీన రూ.128.47 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు.

పాత బకాయిలూ చెల్లింపు

వడ్డీ లేని రుణ పథకం కింద 2014–15 నుంచి 2018–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. దాదాపు 35 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.789.36 కోట్లను సున్నా వడ్డీ రాయితీ కింద ప్రభుత్వం జమ చేసింది. ఇంకా సున్నా వడ్డీ రాయితీ కింద రూ.78 కోట్లతోపాటు పావలా వడ్డీ కింద రూ.42.39 కోట్ల బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు చర్యలు చేపట్టింది. రబీ 2019–20 సీజన్‌కు సంబంధించి వాస్తవ సాగుదారులకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేశామని వ్యవసాయ కమిషనర్ హెచ్‌.అరుణ్‌కుమార్ తెలిపారు.

Read Also…  Coronavirus Masks: కరోనా నివారణ కోసం క్లాత్ మాస్కులను వాడుతున్నారా.. వాటిని శుభ్రం చేసుకునే పధ్ధతి ఏమిటో తెలుసా..!