Andhra Pradesh: ఏపీలో అందరికీ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్.. త్వరలో పంపిణీ.. ప్రత్యేకతలేంటో తెలుసా..?
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సులువుగా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రయత్నాలు అందిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ను ప్రవేశపెట్టింది. అలాగే కొత్త రేషన్ కార్డులను తీసుకురాగా.. త్వరలో ఫ్యామిలీ కార్డులను కూడా పంపిణీ చేయనుంది.

ఏపీలోని కూటమి ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలను చేపడుతోంది. ప్రజలకు ఉపయోగపడేలా అనేక వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త కార్యక్రమాలను అమలు చేస్తోండగా.. త్వరలో మరో కొత్త ప్రొగ్రాంను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేందుకు సిద్దమైంది. అనేక పాలసీలను తీసుకొస్తున్న ప్రభుత్వం.. త్వరలో కొత్త పాలసీని అమలు చేయనుంది. ఈ మేరకు అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యం, పాపులేషన్ మేనేజ్మెంట్పై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో జనాభా నిర్వహణ, ప్రజల ఆరోగ్యం, పిల్లలకు పౌష్టికాహారంపై అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక ప్రకటనలు చేశారు.
జూన్ నాటికి ఫ్యామిలీ కార్డులు పంపిణీ
ఏపీలోని ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్ బెనిఫిట్ సిస్టం ద్వారా సమగ్ర కార్డులు పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కుటుంబానికి సంబంధించిన అన్ని వివరాలు ఈ కార్డులో ఉంటాయి. క్యూఆర్ కోడ్తో కూడిన ఈ స్మార్ట్ కార్డులను జూన్ నాటికి అందరికీ పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆల్ ఇన్ వన్ స్మార్ట్ కార్డుగా ఇది పని చేస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వ సేవలు అందించడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా కుటుంబ, వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఇప్పటికే ఈ వివరాల సేకరణ ప్రక్రియ పూర్తవ్వగా.. జూన్ నాటికి 1.4 కోట్ల కుటుంబాలను ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను పంపిణీ చేయనున్నారు. 24 రకాల వివరాలతో పాటు ప్రజలకు అందిస్తున్న అన్ని సేవల వివరాలు ఇందులో ఉండనున్నాయి.
మార్చి నాటికి పాపులేషన్ పాలసీ
ఇక మార్చి నాటికి ఏపీలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు తెలిపారు. జనాభా విషయంలో వృద్దుల సంఖ్య పెరుగుతుందని, దీంతో పాపులేషన్ పాలసీని రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అటు సంజీవని ప్రాజెక్ట్ ద్వారా జులై నాటికి 66 లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలని తెలిపారు. మధ్యాహ్న భోజనం, అంగన్వాడీల్లో పోష్టికాహారం అందించాలని, నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. ఇక రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గి నార్మల్ ప్రసవాలు పెరిగేలా చేయాలన్నారు. వచ్చే ఏడాది ఎయిడ్స్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని డిక్లేర్ చేస్తామని చంద్రబాబు తెలిపారు. 60 ఏళ్లు దాటితే పనిచేయలేమనే సైకాలజీ ప్రజల్లో ఉండకూడదని, దానిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారంతో పాటు సప్లిమెంట్స్ ఇవ్వాలని చంద్రబాబు పేర్కొన్నారు.
