
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదే నేతన్న సేవలో స్కీమ్. ఇటీవల సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని స్వయంగా ప్రారంభించారు. చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. నేతన్నలకు ఆర్ధికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించినట్లు కూటమి సర్కార్ స్పష్టం చేసింది. అయితే ఇంకా కొంతమందికి డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో వీరికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అర్హత ఉండి అందకపోతే దరఖాస్తులను మళ్లీ పరిశీలిస్తామని తెలిపింది. అర్హులను మరోసారి గుర్తించి వారం రోజుల్లోగా డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఆగస్ట్ 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నగదు జమ చేసిన విషయం తెలిసిందే.
సచివాలయంలో నేతన్న సేవలో పథకంపై మంత్రి సవిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమందికి డబ్బులు పడలేదనే వార్తలపై స్పందించారు. అర్హులను గుర్తించి వారం రోజుల్లోగా డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు 71,536 మందికి రూ.25 వేల చొప్పున జమ చేసినట్లు తెలిపారు. అర్హులైనవారిని గుర్తించి అందరికీ అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ పథకం కోసం 13,678 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని, వారి అప్లికేషన్లను పరిశీలించి వారం రోజుల్లో రూ.25 వేలు అందిస్తామని తెలిపారు. చేనేతల కుటుంబానికి తమ కుటుంబం కట్టుబడి ఉందని, 50 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు అందిస్తామని చెప్పారు. 85,678 మంది పింఛన్లు ఇప్పటికే అందుకున్నారని, అలాగే 62,541 చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొన్నారు.
మీ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలి. అక్కడ దరఖాస్తులను నింపాలి. అలాగే అవసరమైన డాక్యుమెంట్లతో జత చేసి దరఖాస్తు ఫారాలను సచివాలయ అధికారులకు అందించాలి. దీంతో సచివాలయ అధికారుల పరిశీలించి మీకు అర్హత ఉంటే పై అధికారులను వివరాలు పంపిస్తారు. దీంతో మీ పేరును లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. అనంతరం మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. దీంతో అర్హులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సవిత ప్రకటించారు. ప్రతీఒక్కరికీ డబ్బులు అందుతాయని, ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు.