Andhra Pradesh: ఒకే యాప్‌లో ప్రభుత్వ సేవలు.. ఏది కావాలన్నా సెకన్లలోనే.. ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం..

ఏపీ ప్రజలకు మరింత మెరుగ్గా, వేగంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. త్వరలో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న వాట్సప్ గవర్నెన్స్‌కు అనుసంధానంగా యాప్ రూపొందించనుంది. ఈ యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలు పొందవచ్చు.

Andhra Pradesh: ఒకే యాప్‌లో ప్రభుత్వ సేవలు.. ఏది కావాలన్నా సెకన్లలోనే.. ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం..
Andhrapradesh

Updated on: Jun 10, 2026 | 6:11 PM

ఏపీ ప్రభుత్వం ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. అందులో భాగంగా వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. స్మార్ట్‌ఫోన్లలో ప్రతీఒక్కరూ వాట్సప్ అనేది వాడుతున్నారు. దీంతో వాట్సప్ ద్వారానే ప్రభుత్వ సేవలన్నీ చిటికెలో పొందేలా ప్రభుత్వం మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది. అయితే ప్రభుత్వ సేవలను మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట పొందేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ సేవలు సులవుగా పొందవచ్చన్నారు. సీఎం చంద్రబాబు తాజాగా ఆర్టీజీఎస్, వివిధ శాఖల పనితీరుపై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

త్వరలో ప్రత్యేక యాప్

ఈ సందర్భంగా వాట్సప్ గవర్నెన్స్ సేవలు కొనసాగింపులో భాగంగా యాప్ తీసుకురావాలని సూచించారు. ఆర్టీజీఎస్, అవేర్ వంటి వ్యవస్థల ద్వారా పరిపాలనలో మరింత వేగం పెరగాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థలను అమలు చేసేందుకు సిద్దంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అందిపుచ్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించేందుకు కొత్త విధానాలను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ఢిల్లీలో నీతి అయోగ్ సమావేశం జరగనుండగా.. వీటికి సంబంధించి ఆ మీటింగ్‌లో కొత్త విధానాలపై ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. ఇక నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా అన్న క్యాంటీన్లను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మండల స్థాయిలో అన్న క్యాంటీన్లను ఇటీవల ప్రభుత్వం ప్రారంభించింది. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా వినియోగించుకునేలా మరిన్ని అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టనున్నారు.

వాట్సప్ గవర్నెన్స్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాట్సప్ గవర్నెన్స్ సేవలను ప్రవేశపెట్టింది. అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి సేవలను ఇందులో చేర్చింది. ఇన్‌కమ్, క్యాస్ట్ లాంటి ప్రభుత్వ సర్టిఫికేట్లు వాట్సప్ ద్వారానే పొందవచ్చు. ఇక దేవాలయాల దర్శనం టికెట్లు, ఆర్టీసీ బస్సు టికెట్లు, పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్లు లాంటివి బుక్ చేసుకోవచ్చు. అలాగే కరెంట్ బిల్లులు, ట్రాఫిక్ చలాన్లు చెల్లించవచ్చు. ఇలా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రతీ సర్వీసును వాట్సాప్ ద్వారా పొందవచ్చు. అయితే ఈ సేవలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మరిన్ని సేవలకు ఇందులో జోడిస్తోంది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగనవసరం లేదు. ఏ పనైనా మొబైల్ నుంచే పూర్తయ్యలా ఏర్పాాటు చేస్తోంది.

 

Follow Us