Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయానికి వెళుతున్నారా..? ఆ సర్టిఫికేట్ల జారీ రద్దు.. కొత్తగా మరో నిర్ణయం..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి కొత్త పేర్లతో ధ్రువీకరణ పత్రాలను జారీ చేయనున్నారు. పాత పత్రాలను ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో కొత్త పత్రాలను ప్రవేశపెట్టింది.

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం మీ సేవ, స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ధృవీకరణ పత్రాలను జారీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇన్ కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ లాంటి అనేక సర్టిఫికేట్లను వీటి ద్వారా ప్రభుత్వం జారీ చేస్తోంది. తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి ప్రజలు వీటి కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారుల ఆమోదం అనంతరం జారీ అవుతుంది. దీని వల్ల సర్టిఫికేట్లను పొందటం ప్రజలకు సులభతరమైంది. మండల కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ పరిధిలోని సచివాలయాలకు వెళ్లి పొందుతున్నారు. అయితే తాజాగా వీటి విషయంలో చంద్రబాబు సర్కార్ భారీ మార్పులు చేసింది.
ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు
ధ్రువీకరణ పత్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో ధృవపత్రాలు జారీ చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి పేర్లను మార్చింది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలుగా వాటి పేర్లను మార్చుతూ నోటిఫికేషన్ ఇచ్చింది. అయినా ఇప్పటికీ ధ్రువపత్రాలు గ్రామ, వార్డు సచివాలయాల పేరుతోనే జారీ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం గుర్తించి చర్యలు చేపట్టింది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయల పేరుతోనే సర్టిఫికేట్లను జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ధ్రువపత్రాలలో పేర్లను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. పాత పేర్లతో ఉన్న ధృవపత్రాలను రద్దు చేసి కొత్త పేర్లతో జారీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇకపై కొత్త స్టేషనరీ
పాత ధృవపత్రాలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలకు కొత్త పత్రాలను పంపింది. రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకు కొత్త స్టేషనరీని పంపింది. పాత పత్రాలను ఉపయోగించి ఎవరూ ధృవీకరణ పత్రాలను జారీ చేయవద్దని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఐడీ బ్లాక్ చేస్తామని హెచ్చరించింది. ఇక నుంచి కొత్త స్టేషనరీని మాత్రమే ఉపయోగించాలని సూచించింది. కొత్త ధ్రుపపత్రాల్లో వెనుకవైపు ప్రభుత్వం క్యూఆర్ కోడ్ చేర్చింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే సర్టిఫికేట్లు ఎప్పుడు, ఎక్కడ జారీ చేశారనే వివరాలన్నీ తెలుస్తాయి. దీని ద్వారా నకిలీ సర్టిఫికేట్లకు చెక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సర్టిఫికేట్లపై ప్రభుత్వ రాజముద్రతో పాటు హాలోగ్రామ్ ఉంటుంది. కాగా సచివాలయాలతో పాటు మన మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం వాట్సప్లోనే సర్టిఫికేట్లను జారీ చేస్తోంది. దీంతో వాట్సప్ ద్వారానే ప్రభుత్వ సర్టిఫికేట్లను పొందవచ్చు.
