
ఏపీ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే డెబిట్, క్రెడిట్ కార్డులు, స్వైపింగ్, యూపీఐ పేమెంట్స్, క్యూఆర్ కోడ్ స్కాన్ తదితర డిజిటల్ చెల్లింపుల ద్వారా లిక్కర్ కొనుగోలు చేయొచ్చు. పైలెట్ ప్రాజెక్టు గా విజయవాడలో 11 మద్యం ఔట్ లెట్లల్లో ఆన్ లైన్ లావాదేవీలు ప్రారంభించారు. త్వరలోనే పూర్తి స్థాయిలో అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ. రాష్ట్ర వ్యాప్తంగా 3,708 మద్యం షాపులు ఉన్నాయి. ఎస్బీఐ సహకారంతో అన్ని మద్యం విక్రయాల్లో ఆన్ లైన్ చెల్లింపులు చేపడుతోంది ఎక్సైజ్ శాఖ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ నిర్వహణ ఉండనుంది. లిక్కర్ షాపుల్లో హార్డ్ క్యాష్ను తీసుకునేప్పుడు జరుగుతున్న తప్పిదాల నుంచి బయటపడేందుకు.. అమ్మకాల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువస్తుంది.
కోవిడ్ అనంతరం డిజిటల్ చెల్లింపులు వైపు జనాలు ఇంట్రస్ట్ చూపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు క్యాష్ క్యారీ చేసేవారు చాలా అరుదనే చెప్పాలి. ఈ సమయంలో కూడా ఏపీలోని మద్యం దుకాణాల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లిక్కర్ షాపుకు వెళ్దామనుకున్న ప్రతిసారీ క్యాష్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇక బయట రాష్ట్రాల నుంచి ఏపీకి వెళ్లినవారికి ఇది మరీ ఇబ్బందికరంగా మారింది.
మందుబాబుల రిక్వెస్టులతో పాటు.. క్యాషియర్ల చేతి వాటం, నగదు లావాదేవీల్లో వ్యత్యాసానికి సంబంధించి ఫిర్యాదులు అందడంతో.. డిజిటల్ పేమెంట్స్కు ప్రభుత్వం మొగ్గు చూపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..