Jagananna Chedodu: ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్

|

Feb 08, 2022 | 12:45 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్తను తీసుకువచ్చింది. జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదు జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

Jagananna Chedodu: ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
Cm Ys Jagan
Follow us on

Andhra Pradesh Jagananna Chedodu Scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం(AP Government) మరో శుభవార్తను తీసుకువచ్చింది. జగనన్న చేదోడు పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రెండో ఏడాది నగదు జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy). 2 లక్షల 85 వేల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు 285 కోట్ల రూపాయలు విడుదల చేశారు సీఎం జగన్. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్‌ నొక్కి నగదు బదిలీ చేశారు.

జగనన్న చేదోడు కింద ఏటా ప్రభుత్వం షాపులున్న ప్రతి ఒక్కరికి 10 వేల రూపాయల సాయం అందిస్తోంది. ఈ దఫాలో లక్షా 46 వేల మంది టైలర్లకు 146 కోట్లు, 98 వేల మంది రజకులకు 98 కోట్లు, 40వేల మంది నాయీ బ్రాహ్మణులకు 40 కోట్ల రూపాయల నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. ఇవాళ్టి రెండో విడత నగదుతో కలిపి.. ఇప్పటి వరకూ జగనన్న చేదోడు కింద ప్రభుత్వం 583 కోట్లు విడుదల చేసినట్లు అయింది.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దళారీ వ్యవస్థ లేకుండా లంచాలు, వివక్షతకు తావు లేకుండా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు అమలు చేస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం నీరుగార్చిందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తున్నామన్న ఆయన.. ఏలూరులోని తానిచ్చిన మాట ప్రకారం బీసీలను వెన్నెముక కులాలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రతిపాదికన నియమించిన రాష్ట్రం కేవలం ఏపీ మాత్రమేనని సీఎం జగన్ అన్నారు. కేబినెట్‌ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు 60 శాతం అవకాశం కల్పించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. శాసనసభ స్పీకర్ పదవి సైతం బీసీలకు ఇచ్చామని చెప్పారు. అనేక పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనారిటీలకు పెద్ద పీట వేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చామని చెప్పారు. స్థానిక సంస్థల్లో 73 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పదవులు కట్టబెట్టామన్నారు. అటు నామినేటెట్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వర్గాలకే ఇచ్చామని వెల్లడించారు.

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కోర్టుకెళ్లారు. పేదలకు ఇల్లు రాకుండా అడ్డుకున్న చంద్రబాబుకు కామ్రేడ్లు మద్దతు ఇస్తున్నారు. ఎర్రజెండా వెనక.. పచ్చ జెండా ఉందని విమర్శించారు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ ఉన్నవారికే ఆందోళనలు కావాలి అని తెలిపారు.