Ration Door Delivery Vehicles : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకుంటున్నారు. నవరత్నాల్లోని అన్ని అంశాలను నెరవేర్చుతున్నారు. పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేస్తూన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రజా పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని వినూత్న కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు.
రేషన్ సరుకుల కోసం కార్డుదారులు ముఖ్యంగా రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు ఎదుర్కొంటున్న అవస్థలను గుర్తించిన సీఎం జగన్ ఇంటివద్దే వాటిని అందచేస్తామని మాట ఇచ్చారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా వాహనాలను ఇవాళ సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను అదే రోజు మంత్రులు ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 1వతేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం 9,260 వాహనాలు సిద్ధమయ్యాయి.