
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపైనా కేబినెట్ చర్చించింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది..ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 38 అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. ఇటీవల రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.19వేల 37 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ రంగాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో పాటు ఇప్పటికే నడుస్తున్న పరిశ్రమల విస్తరణకు ఆమోదం తెలిపింది కేబినెట్. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 69 వేల 565 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఇక ధాన్యం కొనుగోలు కోసం ఏపీ మార్క్ ఫెడ్ కు ప్రభుత్వ గ్యారంటీతో రూ. 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఇచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం తెలపింది. అలాగే రవాణా, రోడ్లు భవనాల శాఖకు చెందిన 139 గెస్ట్ హౌస్ల్లో 467 మంది సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇక ఇదే శాఖల్లో కొత్తగా పలు కొత్త యూనిట్లు ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు జరుగుతున్న తీరుపై మంత్రి మండలి చర్చించింది. ఇంటింటికీ వైద్య పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ చికిత్స అందించేలా జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. పరిశ్రమల శాఖలో కొత్తగా భూకేటాయింపుల పాలసీకి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా కానుకగా ఉద్యోగులకు ఇచ్చిన డీఏ కు జీవోకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…