కరోనా కల్లోలం..గంటల వ్యవధిలో 14మంది మృతి..ఆక్సిజన్ లీకేజీతో మరణాలు అవాస్తవం.
అనంత సర్వజనాసుపత్రిలో కరోనా వైరస్ మరణ మృదంగం సృష్టించింది. గంటల వ్యవధిలో ఏకంగా 14మంది మృత్యువాత పడిన సంఘటన కలకలం రేపింది. అయితే ఈ మరణాలన్నీ ఆక్సిజన్...
అనంత సర్వజనాసుపత్రిలో కరోనా వైరస్ మరణ మృదంగం సృష్టించింది. గంటల వ్యవధిలో ఏకంగా 14మంది మృత్యువాత పడిన సంఘటన కలకలం రేపింది. అయితే ఈ మరణాలన్నీ ఆక్సిజన్ లోపం కారణంగానే జరిగినట్లు ఆరోపణలు రావడం మరింత ఆందోళన రేకెత్తించింది. విషయం తెలుసుకున్న అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, డాక్టర్ సిరి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. వార్డులన్నీ తిరిగి లోపం ఎక్కడ ఉందన్న దానిపై ఆరా తీశారు.
రాత్రి 10గంటల సమయంలో ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ అక్కడి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలపై కొందరు కావాలని దుష్ప్రచారం చేశారని అన్నారు. వాస్తవంగా అనంతపురం జిల్లాలో ఆక్సిజన్ కొరత ఎక్కడా లేదన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ, విద్యుత్ విభాగాల్లో ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సంవత్సర కాలంలోనే జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 వేల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. మూతపడ్డ వాటిని కూడా తెరిపించామన్నారు.
కోవిడ్ రోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. ఇక,ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చివరి నిమిషంలో ఇక్కడికి రావడంతో కొందరు మృతి చెందుతున్నారని చెప్పారు.