ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని ఘాటు కామెంట్లు చేశారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని తరలింపు మీ తాత, ముత్తాతల వల్ల కూడా వీలు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిని తరలించే హక్కు ఎవరికీ లేదని, అమరావతిని అభివృద్ధి చేయడం చేతకాకపోతే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని మాయ మాటలు చెబితే నమ్మి ప్రజలు ఓట్లేశారని, ఇప్పుడు తప్పుచేస్తే ఇక్కడి మహిళలు చీపురుకట్టలతో తరిమి కొడతారని ఆయన ఘాటు కామెంట్లు చేశారు.
చంద్రబాబు కట్టాడనే జగన్ ప్రజావేదిక కూల్చివేయించారని.. అశుభంతో జగన్ తన పరిపాలన ప్రారంభించారని కేశినేని అన్నారు. నిజానికి చెప్పాలంటే.. ఆదాయ మార్గాలే తప్ప విశాఖపై జగన్కు ప్రేమ లేదని ఆయన చెప్పుకొచ్చారు. మళ్లీ ఎన్నికలకు వెళితే వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తరిమి కొడతారని కేశినేని విమర్శించారు. ప్రజలు151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా జగన్కు పాలన చేతకాలేదని ఎద్దేవా చేశారు. మీకు 22 మంది ఎంపీలు ఉన్నా.. మేం ముగ్గురం చాలు అంటూ కేశినేని చెప్పుకొచ్చారు.