మూడు వ్యవసాయ బిల్లులను ప్రభుత్వం ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. వీటిని వైసీపీ, జేడీ-యు సమర్థించగా.. ఇతర విపక్షాలు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. ఒక దశలో పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ సభ్యులు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మధ్యదళారుల పార్టీ అని ఆయన ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ..విజయసాయి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు ఈ విధమైన బిల్లులను కోరడంలేదని వారిపై ప్రభుత్వం బలవంతంగా వీటిని రుద్దుతోందని ఆయన మండిపడ్డారు. మరో వైపు డీఎంకే కూడా ఈ బిల్లుల పట్ల వ్యతిరేకత ప్రకటించింది. ఇవి వ్యవసాయదారులను కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మారుస్తోందని ఈ పార్టీ ఎంపీ ఇలంగోవన్ ఆరోపించారు. అటు ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలకు పూనుకొన్నారు.