ఏపీభవన్ లో ఎంపీ దుర్గాప్రసాద్ కు ఘననివాళి
కరోనా మహమ్మారిబారిన పడి మృతిచెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావును సహచర పార్లమెంట్ సభ్యులు ఘనంగా స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేశారు.
కరోనా మహమ్మారిబారిన పడి మృతిచెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావును సహచర పార్లమెంట్ సభ్యులు ఘనంగా స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఏర్పాటు చేసిన సంతాపసభలో ఏపీ ఎంపీలు పాల్గొన్నారు. దుర్గాప్రసాద్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సత్యవతి, గోరంట్ల మాధవ్, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్య రామి రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్, తలారి రంగయ్యతో పాటు ఏపీ భవన్ ఉన్నతాధికారులు అభయ త్రిపాటి, భావన సక్సేనా, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత నేతతో తమకున్న అనుబంధాన్ని నేతలు గుర్తుకుతెచ్చుకున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 28 ఏళ్ల చిన్న వయస్సులోనే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన దుర్గాప్రసాద్ నిత్యం ప్రజల్లో ఉండే మనిషి అని కొనియాడారు. మరో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. బల్లి దుర్గాప్రసాద్ భోళాగా మాట్లాడే మనిషని అన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వారని, ఆయన అకాల మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని వ్యాఖ్యానించారు. సహచర ఎంపీ దుర్గా ప్రసాద్ మరణం తమను ఎంతో బాధించిందని అనకాపల్లి ఎంపీ డా. సత్యవతి అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.