AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ రాజధానిపై మళ్లీ రగడ.. జగన్ మదిలో ఏముంది..?

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధానిపై మంత్రి బొత్స చేసిన కామెంట్లు అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారాయి. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుండానే రాజధాని ఏర్పాటుకు సిద్ధమైందని బహిరంగంగా బొత్స విమర్శించారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో రాజధానిని తరలించాలన్న ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని వార్తలు రాగా.. దానిపై పెద్ద రగడే జరిగింది. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాజధానిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. […]

ఏపీ రాజధానిపై మళ్లీ రగడ.. జగన్ మదిలో ఏముంది..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 18, 2019 | 12:17 PM

Share

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధానిపై మంత్రి బొత్స చేసిన కామెంట్లు అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారాయి. గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోకుండానే రాజధాని ఏర్పాటుకు సిద్ధమైందని బహిరంగంగా బొత్స విమర్శించారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. దీంతో రాజధానిని తరలించాలన్న ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉందని వార్తలు రాగా.. దానిపై పెద్ద రగడే జరిగింది. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాజధానిపై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఇక తరువాత తరువాత ఆ వివాదం సమసిపోయిందనుకున్న సమయంలో..  తాజాగా మరోసారి రాజధానిపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలి? ఎలా ఉండాలి? ఏ ప్రాంతాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించామని ఆయన తెలిపారు. ఈ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి నివేదికను రూపొందిస్తుందని బొత్స స్పష్టం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో నిపుణుల కమిటీ తన పర్యటనలు ప్రారంభిస్తుందని బొత్స పేర్కొన్నారు.

ఆ తరువాత కమిటీ నివేదికలోని సిఫార్సులపై కేబినెట్‌లో చర్చించి, ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. రాష్ట్రం అంటే అమరావతి ఒక్కటే కాదని.. ఒక కులానికి, వర్గానికి సంబంధించింది మాత్రమే కాదని బొత్స ఆసక్తికరమైన కామెంట్లు చేయడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం తాత్కాలిక సెక్రటేరియట్‌ ప్రాంతంలో వర్షం పడితే ముంపునకు గురయ్యే ప్రమాదముందని ఆయన అన్నారు. ఇక్కడ ఒక భవనం నిర్మించాలంటే పునాదులు 100 అడుగుల లోతులో తవ్వాల్సి వస్తుందని, దీనికి ఖర్చు కూడా చాలా అవుతుందని ఆయన అన్నారు. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగమై, అవినీతి చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినప్పుడు ఇబ్బందులు ఎదురువుతాయని, వీటన్నింటనీ నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని బొత్స తెలిపారు.

ఇక అమరావతిలో నిలిచిపోయిన పనుల్లో అవసరమైన వాటి పూర్తిచేస్తామని, అవసరం లేనివి నిలిపేస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే హైకోర్టు విషయంలో రాయలసీమ, అమరావతి, ఉత్తరాంధ్రలో వస్తున్న డిమాండ్లను కూడా ఈ కమిటీ పరిశీలిస్తుందని మంత్రి తెలియజేశారు. 13 జిల్లాలు అభివృద్ధి కావాలన్నది జగన్ ఆకాంక్ష అని.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి కమిటీ అధ్యయనం చేస్తుందని బొత్స వివరించారు.