Duggirala MPP Election: గుంటూరు జిల్లా(Guntur District) మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎంపీపీ పదవిని కైవసం చేసుకునేందుకు వైసీపీ, టీడీపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. దుగ్గిరాల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది టీడీపీ, ఒకటి జనసేన, 8 మంది వైసీపీ అభ్యర్థులు గెలిచారు. అత్యధిక సీట్లు టీడీపీకి రావడంతో దుగ్గిరాల ఎంపీపీ స్థానం టీడీపీకి వచ్చే అవకాశం ఉంది.
అయితే, 8 స్థానాలు వచ్చిన వైసీపీ, ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీటీసీలను క్యాంప్కు తరలించారు ఎమ్మెల్యే ఆర్కే. ఈ క్యాంప్ రాజకీయం వివాదానికి దారితీసింది. దుగ్గిరాల-2 ఎంపీటీసీగా గెలిచిన తాడిబోయిన పద్మావతి క్యాంప్కు తీసుకెళ్లారు. దీనిపై ఆమె కుమారుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేకపోయినా బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు పద్మావతి కుమారుడు యోగి.
ఈ క్యాంప్ను వ్యతిరేకించినందుకు తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు యోగి. తమకు ఏమన్నా అయితే ప్రభుత్వానిదే బాధ్యత స్పష్టం చేస్తున్నారు, ఎంపీటీసీ తాడిబోయిన పద్మ కొడుకు.