ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద, పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణా నదికి మరోసారి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నదిపై ఉన్న జలాశయాలకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 4 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు స్పిల్ వే 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3.77 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్, పులిచింతలలోకి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో ఉద్ధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్లోకి శనివారం సాయంత్రానికి 4.5 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం వస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు.. కర్నాటక, రాయలసీమలో కురుస్తున్న వర్షాలతో పెన్నా దాని ఉప నదుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. ఉప నదులు జయమంగళ, కుముద్వతి, కుందు, బాహుదా, చిత్రావతి, పాపాఘ్ని, పించా, సగిలేరులో ప్రవాహం అధికంగా ఉంది. నెల్లూరు బ్యారేజ్ నుంచి 81 వేల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పెన్నా ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారాయి. దీంతో నెల్లూరు బ్యారేజ్ వరకు ప్రాజెక్టుల గేట్లు అన్నీ ఎత్తేశారు. కాగా.. ఈ సీజన్లో నెల్లూరు బ్యారేజీ గేట్లను రెండోసారి ఎత్తేయడం కావడం విశేషం.
కనువిందు చేస్తున్న వాటర్ ఫాల్స్..
మరోవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్నూలు జిల్లాలోని జలపాతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. నంద్యాల జిల్లా అవుకు మండలం మంగంపేట కొండల మధ్య జలపాతం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. కరవు ప్రాంతంగా పిలవబడే కర్నూలు జిల్లాలో వర్షాలు కురవడం, జలపాతాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి.