
ఒకరోజు విరామం తరువాత మళ్లీ తిరిగి ఎన్నికల ప్రచారంలోకి దిగారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. వైద్యుల సూచనతో ఒక్కరోజు విశ్రాంతి తీసుకున్న జగన్.. 15వ రోజు యాత్రకు రెట్టించిన ఉత్సాహంతో కేసరపల్లి నైట్ క్యాంప్ నుంచి యాత్ర ప్రారంభించారు. ఇవాళ్టి బస్సుయాత్ర ప్రారంభానికి ముందు పార్టీ నేతలను కలిశారు. ఆయన కంటిపై ఇంకా వాపు కనిపిస్తోంది. ఎడమవైపు కంటిమీద దెబ్బ తగిలిన భాగానికి ప్లాస్టర్ ధరించారు. ఈ గాయం గురించి వైసీపీ నేతలు అధినేతను అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు ప్లాస్టర్తోనే జగన్ ఇవాళ్టి బస్సుయాత్రలో పాల్గొన్నారు.
ప్రస్తుతం మేమంతా సిద్దం బస్సు యాత్ర.. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా జొన్నపాడుకు చేరుకుంటుంది. భోజన విరామం తర్వాత జనార్దనపురం మీదుగా మధ్యాహ్నం గుడివాడకు చేరుకుని బహిరంగసభలో ప్రసంగిస్తారు జగన్. సభ అనంతరం హనుమాన్ జంక్షన్ మీదుగా కృష్ణాజిల్లా నుంచి పశ్చిమగోదావరిలోకి ప్రవేశించనున్నారు. అయితే జగన్ బస్సుయాత్రగా వెళ్లేమార్గంలో పోలీసులు ఆంక్షలను కఠినం చేశారు. క్రేన్లతో భారీ గజమాలలు వేయడాన్ని నివారించాలని ముఖ్యమంత్రి భద్రతా విభాగం సూచించింది. అలాగే, జగన్పై అభిమానులు, ప్రజలు పువ్వులు విసరడాన్ని కూడా ఇకనుంచి అనుమతించడం ఉండదు. కానీ యధావిధిగా సీఎం జగన్ మాత్రం ప్రజలను కలుసుకుంటారు.
మేమంతా సిద్ధం యాత్ర 15వ రోజు ప్రారంభమైంది. మొన్న విజయవాడ సింగ్నగర్లో దాడి ఘటన కారణంగా నిన్న యాత్రకు విరామం ఇచ్చారు.ఇవాళ్టి నుంచి మళ్లీ జనంలోకి వచ్చా సీఎం జగన్. ఐతే.. నిఘా వర్గాల సూచనల మేరకు జగన్ భద్రతలో భారీగా మార్పులు చేశారు. సీఎంకు ఇప్పుడున్న భద్రతకు అదనంగా సెక్యూరిటీ పెంచారు. సీఎం జగన్ వెళ్లే మార్గంలో సీనియర్ డీఎస్పీలతో భద్రత ఏర్పాటు చేశారు. ఇకపై మరింత పటిష్టంగా మూడంచెల భద్రత ఉండనుంది. సీఎం వెళ్లే మార్గాలను సెక్టార్ల వారీగా విభజించి.. ఒక్కో సెక్టార్కు ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు ఉండేలా చూస్తున్నారు. నిర్ధేశించిన రోడ్డు మార్గంలోనే రోడ్షో, బహిరంగసభలు ఉంటాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..