Andhra Pradesh: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన ఎన్డీఏ సర్కార్…

|

Aug 21, 2024 | 10:22 AM

ఏపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సాధ్యమైనంత త్వరగా పేదలకు ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటు వైసీపీ మాత్రం ఎన్నికల హామీని విస్మరించి.. పేదల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తోందంటూ కౌంటర్‌ ఎటాక్‌కి దిగుతోంది.

Andhra Pradesh: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన ఎన్డీఏ సర్కార్...
CM Chandrababu
Follow us on

వంద రోజుల్లో లక్షా 20వేల ఇళ్ల నిర్మాణమే లక్ష్యమన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. రాబోయే రోజుల్లో మొత్తంగా 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమైందని తెలిపారు. గృహనిర్మాణ శాఖపై సమీక్షించిన ఆయన.. గత ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా భూములు తీసుకుందన్నారు. రాజకీయ కక్షపూరిత ఆలోచనలు కారణంగా ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందిపడ్డారన్నారు. 2014-2019 గృహ నిర్మాణాలపై కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని.. వాటికి కూడా డబ్బు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు పార్థసారథి. గత ప్రభుత్వంలో గృహనిర్మాణాలను వ్యాపార ధోరణిలో చూశారని విమర్శించారాయన.

సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇళ్ల నిర్మాణాలను క్వాలిటీ చెక్ చేస్తామన్నారు మంత్రి పార్థసారథి. లబ్ధిదారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని.. అయితే రుణం తీసుకుని ఇల్లు నిర్మాణం చేపట్టని వారు భవిష్యత్తులో ఇబ్బందిపడతారన్నారు. ఏపీలో కొత్త ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నాయి. దీంతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా రూ.30 వేలు సైతం చెల్లిస్తారు. కాగా  గృహ నిర్మాణాల్లో మట్టి కోసం కొత్త విధానం ఆలోచించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మట్టికి బదులుగా ఫ్లై యాష్‌ను ఉపయోగించే విధంగా ఆలోచన చేస్తున్నామన్నారు.

మంత్రి పార్థసారథి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది వైసీపీ. తమ హయాంలో కోట్లాది రూపాయల భూముల్ని పేదలకు పంచామన్నారు ఆ పార్టీ నేత కాకాణి గోవర్ధన్‌. ఎన్నికల సమయంలో ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు లక్షన్నర మాత్రమే ఇస్తాననడం సరికాదన్నారాయన. గత ప్రభుత్వం వరదలొచ్చే ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కేటాయించిందని అధికార టీడీపీ విమర్శిస్తుంటే.. వైసీపీ మాత్రం తమ నిర్ణయాలతో ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చిందంటోంది. మొత్తానికి పేదలకు ఇళ్ల కేటాయింపుపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..