
విజయవాడలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన జిమ్ ట్రైనర్, బరువు తగ్గిస్తానని నమ్మించి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
విజయవాడలో ఓ యువతిపై జిమ్ ట్రైనర్ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు కలకలం రేపాయి. బాధిత యువతి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం, ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న యువతికి ఇన్స్టాగ్రామ్ ద్వారా జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్తో పరిచయం ఏర్పడింది. బరువు తగ్గాలనుకుంటున్న తనకు ఫిట్నెస్, డైట్కు సంబంధించిన సూచనలు ఇస్తూ నిందితుడు సన్నిహితంగా మారినట్లు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. కొంతకాలం తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ ఓ ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లిన అబ్దుల్ ఖాదర్, బరువు తగ్గేందుకు ప్రత్యేక షేక్ అంటూ ఒక పానీయం ఇచ్చాడని యువతి ఆరోపించింది. ఆ పానీయం తాగిన అనంతరం తనకు మత్తు రావడంతో స్పృహ కోల్పోయానని, ఆ సమయంలో తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, నగ్న ఫోటోలు తీసి వాటిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య నివేదికలు, సాక్ష్యాధారాలు, డిజిటల్ ఆధారాలను సేకరిస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితుడు అబ్దుల్ ఖాదర్ పరారైనట్లు సమాచారం. అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..