
కాలం మారుతోంది. జీవనశైలి మారుతోంది. కానీ బంధాలు మాత్రం మారకూడదని గట్టిగా నమ్ముతున్న ఓ కుటుంబం ఆస్తుల కంటే ఆప్యాయతలే గొప్పవని ఆచరణలో నిరూపిస్తోంది ఆ ఉమ్మడి కుటుంబం. నేటి సమాజంలో చిన్నచిన్న కారణాలతో కుటుంబాలు విడిపోతుంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామంలోని ఓ ఉమ్మడి కుటుంబం మాత్రం ఆరు తరాలుగా ఒక్కటిగానే జీవిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఉమ్మడి కుటుంబంగా పేరొందింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకే సజీవ నిదర్శనం. రెండు కుటుంబాలతో మొదలైన ఈ వంశం నేడు ఆరు తరాలకు విస్తరించి ఏకంగా 83 మంది సభ్యులతో ఒకే కుటుంబంగా కొనసాగుతోంది. కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు, ముత్యాలప్ప చూపిన మార్గంలో అందరూ ఐక్యంగా జీవిస్తున్నారు. కలిసుంటేనే కలదు సుఖమనే మాటను జీవితంలో ఆచరిస్తున్నారు.
ఈ కుటుంబంలో 43 మంది ఓటర్లు 20 మంది కుమారులు, 20మంది కోడళ్లు ఉన్నారు. ఒకే ఇంట్లో అత్తా కోడళ్ళు కలిసి ఉండలేని ఈ రోజుల్లో ఆరుగురు అత్తలు, 23 మంది కోడళ్ళు ఒకే చోట కలిసి ఉండటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం నాలుగు భవనాల్లో నివసిస్తున్నా మనసులు మాత్రం ఒక్కటే అంటున్నారు. అవసరమైతే మరిన్ని ఇళ్లు కట్టుకుంటాం. కానీ కుటుంబాన్ని మాత్రం విడగొట్టమని స్పష్టం చేస్తున్నారు. కోడళ్ల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా పెద్దల వరకు తీసుకెళ్లకుండా మాట్లాడుకుని పరిష్కరించుకోవడమే తమ కుటుంబ సాంప్రదాయమని చెబుతున్నారు. మా కుటుంబంలో కోడళ్ల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినా మేమే మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. పెద్దల వరకు వెళ్లే పరిస్థితి రాదు. మా కుటుంబాన్ని చూసి మరెందరో కలిసి మెలిసి జీవించాలని కోరుకుంటున్నాం అంటున్నారు కుటుంబ సభ్యులు ఆస్తుల కంటే అనుబంధాలే గొప్పవని నమ్మే ఈ కుటుంబం తమ ఐదో తరం పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తోంది. ప్రభుత్వ హాస్టళ్లలోనే ఉంచి విద్యాభ్యాసం చేయిస్తోంది. ఆరు తరాలుగా బంధుత్వ వివాహాలు జరిగినా తమ కుటుంబంలో ఎలాంటి జన్యుపరమైన ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. ఆహారంలోనూ సంప్రదాయానికే పెద్దపీట వేస్తోంది ఆ కుటుంబం. ప్రతిరోజూ కట్టెల పొయ్యిపైనే రాగి సంగటి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు తయారు చేస్తారు.
పండుగలొస్తే ఈ ఇంట్లో సందడి మరింత ప్రత్యేకం. కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరితే ఒక పొట్టేలు , 15 కిలోల చికెన్ సాధారణమే. అందరూ పూర్తిగా చేరితే మూడు పొట్టేళ్లు, 40 కేజిల చికెన్ అవసరమవుతాయని నవ్వుతూ చెబుతున్నారు. వ్యవసాయమే ఈ కుటుంబానికి ప్రధాన జీవనాధారం. సుమారు 120 ఎకరాల్లో వేరుశెనగ, టమాటా, వంకాయ, కర్బూజా, బొప్పాయి, మిరప, వరితో పాటు పలు పంటలు సాగు చేస్తున్నారు. 200 బోర్లు వేయగా ప్రస్తుతం 34 బోర్లు పనిచేస్తున్నాయి. పంటల సాగు నుంచి కోత వరకు ప్రతి పనినీ కుటుంబ సభ్యులే కలిసి నిర్వహిస్తారు. వ్యవసాయంతో పాటు ఐదు శ్రీకృష్ణ హనుమాన్ ట్రావెల్స్ బస్సులు, వెయ్యి గొర్రెలు, 70 గేదెలు, మూడు ట్రాక్టర్లు, బొలెరో, ఐచర్ వాహనాలను కూడా సమిష్టిగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయమే కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు, ముత్యాలప్ప కుటుంబ సభ్యుల ఎవరెవరు ఏమేం పనులు చేయాలో నిర్ణయిస్తారు. కుటుంబ పెద్దల మాట ప్రకారమే మిగిలిన కుటుంబ సభ్యులందరూ నడుచుకుంటారు. కోడళ్ళల్లో కొంతమంది పొలం పనులకు వెళితే మరి కొంతమంది కుటుంబ సభ్యులందరికీ భోజనం సిద్ధించేస్తారు.
ఎన్నో కష్టాలు చూశాం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం కానీ ఎప్పుడూ విడిపోవాలనే ఆలోచన రాలేదు. మేము ఉన్నంతకాలం ఈ కుటుంబం ఇలాగే కలిసే ఉంటుంది. మా తర్వాతి తరాలు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భగవంతుడిని కోరుకుంటున్నాం అంటున్నారు కుటుంబ పెద్దలు హనుమంతరాయుడు, ముత్యాలప్ప. సంపదలు శాశ్వతం కావు. కానీ బంధాలు శాశ్వతమని.. ఐకమత్యమే కుటుంబానికి అసలైన బలమని కుర్లపల్లి హనుమంత రాయుడు, ముత్యాలప్ప కుటుంబం నిరూపిస్తోంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగవుతున్న ఈ రోజుల్లో ఈ కుటుంబం నేటి సమాజానికి నిజంగా ఆదర్శంగా నిలుస్తోంది.