
వయసు పెరిగేకొద్దీ అడుగు వేయడమే కష్టంగా మారే రోజులు వస్తాయి. 60 లేదా 70 ఏళ్లు దాటిన తర్వాత చాలా మంది మోకాళ్ల నొప్పులు, ఆయాసం, శారీరక బలహీనతతో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమయంలో ఓ శతాధిక వృద్ధురాలు చూపించిన సంకల్పం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కర్ణాటకలోని ఓ గ్రామానికి చెందిన లక్ష్మవ్వ శతాధిక వృద్ధురాలు. కొంతమంది ఆమెను భీమవ్వ అని కూడా పిలుస్తారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 116 ఏళ్ల వయస్సులో ఉన్నారు. అధికారికంగా ఆమె వయస్సుపై నిర్ధారణ లేకపోయినా, ఆమె శతాధిక వృద్ధురాలనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత వయస్సులోనూ ఆమె తిరుమల అలిపిరి కాలినడక మార్గాన్ని ఎంచుకున్నారు. సుమారు 3,550 మెట్లు ఉన్న ఈ మార్గాన్ని ఎవరి సహాయం తీసుకోకుండా, చేతిలో కేవలం ఒక కర్రను ఆసరాగా పట్టుకుని, గోవిందా… గోవిందా… అంటూ స్వామివారి నామస్మరణ చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ తిరుమల చేరుకున్నారు.
ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం, భక్తి చూసిన సహయాత్రికులు ఆశ్చర్యపోయారు. వయస్సు శరీరానికి పరిమితులు విధించినా, మనసు బలంగా ఉంటే అసాధ్యమనుకున్న లక్ష్యాలను కూడా చేరుకోవచ్చని భీమవ్వ మరోసారి నిరూపించారు. ఈ ఘటనను చూసిన పలువురు భక్తులు, ఇంత వృద్ధాప్యంలోనూ ఆమెకు లభించిన శారీరక, మానసిక శక్తి శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహమేనని తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం ఆమె సంకల్పం, జీవనశైలి, మానసిక దృఢత్వమే ఈ ప్రయాణాన్ని విజయవంతం చేశాయని అభిప్రాయపడ్డారు.
ఏది ఏమైనా, 116 ఏళ్ల వయస్సులో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల చేరిన భీమవ్వ ప్రయాణం ఇప్పుడు వేలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, దృఢమైన సంకల్పం ఉంటే ఎన్నో అద్భుతాలు సాధ్యమవుతాయని ఆమె మరోసారి చాటి చెప్పారు.