
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూయార్క్లోని రోచెస్టర్ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృత్యువాతపడగా, మరికొంత మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే కాప్స్ ఘటన స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
గత కొద్ది రోజులుగా అమెరికాలో నల్లజాతీయులపై జాత్యహంకార దాడులకు నిరసనగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే నిరసనలకు దిగిన ఆందోళనకారులపైకి విచక్షణా రహితంగా దాడులు చేసినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన పారిపోయిన దుండగుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
అమెరికాలో కాల్పుల సంస్కృతి సాధారణమైపోయింది. నిత్యం ఎక్కడో ఒక చోట కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అమెరికాలో పౌరులపై కాల్పులు జరిగిన ప్రతిసారీ తుపాకుల వినియోగానికి కళ్లెం వేయాలనే డిమాండ్ వినిపిస్తుంటుంది. అమెరికాలో జరిగే హత్యలు, ఆత్మహత్యల్లో అత్యధికంగా తుపాకీనే వాడుతున్నారు.
ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఆయుధాలు కలిగి ఉన్న దేశం అమెరికానే. ఆయుధాల నియంత్రణకు పట్టుబట్టే వారి సంఖ్య పెరుగుతున్నా ఈ దిశగా నిర్దిష్ట చర్యలు కనిపించడం లేదు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు అధికంగా ఆయుధాలు కలిగి ఉన్నారు. గ్రామీణులు ఎక్కువగా ఉండే న్యూయార్క్, కాలిఫోర్నియాతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ తుపాకులకు మద్దతుగా నిలిచే ఓటర్ల సంఖ్య ఎక్కువ.
ఆయుధాల వినియోగాన్ని నియంత్రించేందుకు బలమైన చట్టాలు తీసుకురాకుండా అడ్డుకునే వారు అమెరికాలో గణనీయ సంఖ్యలో ఉన్నారు. అందువల్లే తుపాకీ సంస్కృతికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతోంది. అమెరికాలో ఆయుధాల నియంత్రణ బిల్లులు సెనేట్ ఆమోదానికి నోచుకోవడం లేదు. బిల్లులను వ్యతిరేకించే వర్గం కావాలనే ప్రక్రియ ఆలస్యమయ్యేలా చేస్తోంది.
అమెరికాలో ప్రతి పౌరుడు తుపాకీని కలిగి ఉండే హక్కును రాజ్యాంగం కల్పిస్తోందని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అనుమతుల జారీలోగానీ, తుపాకీ కొనుగోలుకుగానీ కఠిన నిబంధనలు ఉండరాదని నిర్దేశించింది. రాష్ట్రాలు తీసుకొచ్చే కఠిన నిబంధనలను సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి దిగువ కోర్టులూ కొట్టి వేస్తున్నాయి.