“ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబులే”.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక..!

ఇరాన్‌తో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరే దశకు చేరుకుంది. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు జరగడానికి కేవలం రెండు రోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోతే మళ్లీ బాంబులే.. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక..!
Donald Trump At G7 Summit

Updated on: Jun 17, 2026 | 5:25 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశారు. నెలల తరబడి కొనసాగిన యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరే దశకు చేరుకున్నప్పటికీ, అది ఇంకా అంతిమ ఒప్పందం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఇరాన్ తన నిబంధనలను పాటించకపోతే మళ్లీ సైనిక దాడులు ప్రారంభించేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.

ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ట్రంప్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇరాన్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ఇంకా పూర్తిగా ఖరారు కాలేదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందంలోని కొన్ని అంశాలు తన అంచనాలకు అనుగుణంగా లేకపోతే, ఇరాన్ తన హామీలను నిలబెట్టుకోకపోతే అమెరికా మళ్లీ సైనిక చర్యలకు దిగుతుందని హెచ్చరించారు. “ఇరాన్ సరిగ్గా ప్రవర్తించకపోతే బాంబు దాడులను తిరిగి ప్రారంభించడానికి వెనుకాడం” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. గత 47 ఏళ్లుగా వారు తప్పు మార్గంలోనే నడుస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు అధికారికంగా ఒప్పందంపై సంతకాలు చేయడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉండగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ ఒప్పందం ప్రకారం 60 రోజుల పాటు కాల్పుల విరమణ అమలు చేయడం, హోర్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడం, ఇరాన్‌పై ఉన్న కొన్ని ఆంక్షలను సడలించడం వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం. అయితే, ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా 300 బిలియన్ డాలర్ల నిధులు అందిస్తుందన్న వార్తలను ట్రంప్ ఖండించారు. “మేము ఒక్క సెంట్ కూడా ఇవ్వడం లేదు. ఎలాంటి పునర్నిర్మాణ నిధి లేదు” అని స్పష్టం చేశారు.

అమెరికా-ఇరాన్ మధ్య అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత రెండు దేశాలు ఒప్పందానికి చేరువైనట్లు కనిపించింది. అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే, ఒప్పందం కుదిరినా దాని అమలుపై అమెరికా కఠిన వైఖరిని కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఒప్పందం అధికారిక రూపం దాల్చుతుందా? లేక మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us