
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. నాలుగు వారాల్లో యుద్ధం ముగుస్తుందని ప్రకటించిన ట్రంప్కు ఇరాన్ పోరాటం మింగుడుపడడం లేదు. 30 రోజులుగా ఇరాన్ చేస్తున్న పోరాటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఏకకాలంలో ఇజ్రాయెల్, అమెరికాతో పోరాటం.. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూ ఇప్పటికీ తన పవర్ను ప్రదర్శిస్తోంది. తమ సుప్రీం లీడర్ను కోల్పోయినా.. టాప్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోయినా.. IRGC మాత్రం లొంగలేదు. చిన్న డ్రోన్లతోనే పెద్ద లక్ష్యాలను చేధిస్తోంది. మిసైళ్లతో ఇజ్రాయెల్పై దాడులు చేస్తోంది. అమెరికా ఎయిర్ఫోర్స్లోనే ఫ్లాగ్షిప్ ఫైటర్జెట్గా పేరున్న F-35ను ఫుల్లుగా డ్యామేజ్ చేసింది. అంతేకాదు.. 15కు పైగా అమెరికా యుద్ధ విమానాలు ఈ వార్లో కూలిపోయాయి. అయితే ఇరాన్ కూడా చాలా కోల్పోయింది. ఆ దేశంలోని అణు స్థావరాలే టార్గెట్గా అమెరికా విరుచుకుపడుతోంది. ఇరాన్పై సైనిక చర్య చేపట్టి.. ఆ అణ్వాయుధాలను వశపర్చుకోవాలని చూస్తోంది అమెరికా.
ఈ తరుణంలో యుద్ధాన్ని ఎలా ముగించాలనే విషయంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐఆర్జిసి అధిపతి అహ్మద్ వాహిది మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వెలువడ్డాయి. పెజెష్కియాన్ను మితవాదిగా పరిగణిస్తుండగా, ఐఆర్జిసి అధిపతి కఠినవాద భావజాలాన్ని కలిగి ఉన్నాడు. అతన్ని అమెరికా, ఇజ్రాయెల్లను బద్ధ శత్రువులుగా భావిస్తున్నాయి. కొనసాగుతున్న యుద్ధాన్ని, దాని ప్రభావాన్ని, ముఖ్యంగా అది పౌర జనాభా, దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఈ విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.
ఇరాన్ ఇంటర్నేషనల్ కథనం ప్రకారం, అధ్యక్షుడు పెజెష్కియన్ ఐఆర్జిసి వ్యూహాన్ని ప్రశ్నించారు. ఉద్రిక్తతలు నిరంతరం పెరగడం, పొరుగు దేశాలపై దాడులు జరగడం దేశ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయని ఆయన అన్నారు. యుద్ధం త్వరగా ఆగకపోతే, రాబోయే మూడు వారాల నుంచి ఒక నెలలోపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలవచ్చని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. మార్చి 7న, పెజెష్కియన్ ఒక వీడియో సందేశంలో పొరుగు దేశాలపై జరిగిన దాడులకు క్షమాపణలు చెప్పి, అటువంటి దాడులను ఆపాలని సైన్యాన్ని ఆదేశించారు. కానీ ఆయన ప్రకటన తర్వాత కూడా దాడులు కొనసాగాయి.
ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ డిమాండ్లు
పరిస్థితిని మెరుగ్గా నిర్వహించడానికి ప్రభుత్వానికి పూర్తి పరిపాలనా అధికారాన్ని ఇవ్వాలని అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కానీ అహ్మద్ వాహిది ఈ డిమాండ్ను ఖచ్చితంగా తిరస్కరించారు. దీనికి ప్రతిస్పందనగా, యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అవసరమైన సంస్కరణలను అమలు చేయనందున ప్రస్తుత పరిస్థితికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని ఐఆర్జిసి అధిపతి పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ పాలకవర్గంలో చీలికలు మొదలవుతున్నాయని ఇజ్రాయెల్ మీడియా కూడా పేర్కొంది. ఈ పరిస్థితి తీవ్రమవుతోందని, ఇది భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీయవచ్చని కొన్ని కథనాలు సూచిస్తున్నాయి. యుద్ధం దేశ ఆర్థిక పరిస్థితిని క్రమంగా మరింత దిగజార్చింది. అనేక నగరాల్లో ఏటీఎంలు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని పనిచేయడం లేదు. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు తరచుగా నిలిచిపోవడంతో, ప్రజలు డబ్బు విత్డ్రా చేసుకోవడం కష్టంగా మారింది. గత మూడు నెలలుగా చాలా మందికి జీతాలు, అలవెన్సులు సకాలంలో అందలేదని ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారని పేర్కొన్నారు.
ఇరాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం
ఇరాన్ యుద్ధం ప్రారంభం కాకముందే, ఫిబ్రవరిలో నిత్యావసర వస్తువుల ద్రవ్యోల్బణం 105% నుంచి 115% మధ్యకు గణనీయంగా పెరిగింది. ఇప్పుడు, యుద్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది. మొత్తంగా, ఇరాన్ ఒక బాహ్య యుద్ధాన్ని ఎదుర్కొంటుండగా, ప్రభుత్వం, సైన్యం మధ్య అంతర్గత విభేదాలు పెరుగుతూ, పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి.
మరింత అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..