
సముద్రపు లోతుల్లో ఎవరూ ఊహించని విపత్తు పుట్టుకొస్తోంది. పసిఫిక్ మహాసముద్ర గర్భంలో వేడి జ్వాలలు రాజుకుంటున్నాయి. ప్రపంచ భవిష్యత్తును ఆందోళనకరంగా మార్చేందుకు సిద్ధమయ్యాయి. గడిచిన వందేళ్ల మానవ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రమాదకర ‘ఎల్ నినో’ ఉత్పాతం భూగోళంపై విరుచుకుపడబోతోందని బ్రిటన్ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక అంతర్జాతీయ సమాజాన్ని గజగజ వణికిస్తోంది!
సాధారణంగా ఎల్ నినో సంభవించినప్పుడు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయి. కానీ ఈసారి రాబోయే ఎల్ నినో ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా 3 డిగ్రీల సెల్సియస్ (5.4°F) మేర ఉష్ణోగ్రతలను పెంచబోతోందని వాతావరణ నిపుణుడు ఆడమ్ స్కేఫ్ స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా ఫోర్కాస్టింగ్ రికార్డుల్ని చూస్తున్న తను ఇంతటి భయానక, తీవ్రమైన సముద్ర ఉష్ణ తరంగాలను ముందెన్నడూ చూడలేదనీ ఇది వాతావరణ చరిత్రలోనే మునుపెన్నడూ లేని ఘోర విపత్తు అని హెచ్చరించారు.
చాలా దేశాలలో కార్చిచ్చు అడవులను దహించివేస్తోంది. ఇప్పటికే ఇండోనేషియాలో దాదాపు 2 లక్షల హెక్టార్ల అడవులు బూడిద కాగా, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో 3.25 లక్షల మందికి పైగా ప్రాణభయంతో ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. కరువు కాటకాల ఫలితంగా ఆకలి కేకలు మరింత పెరగనున్నాయి. అమెరికా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి తాగునీరు, ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.
ఉత్తరార్థ గోళంలో శీతాకాలం ప్రారంభం కాగానే యూకే, వాయువ్య యూరప్ ప్రాంతాల్లో విధ్వంసకర గాలులు, అకాల వర్షాలు భీభత్సాన్ని సృష్టించనున్నాయి. మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న వాతావరణ మార్పులకు ఈ ఎల్ నినో ఉగ్రరూపం కూడా తోడైతే, రాబోయే 2027 సంవత్సరం భూగ్రహ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యే నరకప్రాయమైన ఏడాడిగా మారుతుందని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. ప్రకృతి విసురుతున్న సవాలును తట్టుకోవడానికి మానవాళి సిద్ధంగా ఉందా? లేదా ప్రకృతి విశ్వరూపానికి బలికాక తప్పదా? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో ఊహిస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది!